ఐవోఏపై వేటు వేసిన కేంద్ర క్రీడాశాఖ
ఐవోఓ జీవితకాల అధ్యక్షులుగా సురేష్ కల్మాడీ, చౌతాలాలు ఎంపిక విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం 5గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామ్చంద్రన్ విదేశాల్లో ఉన్న నేపథ్యంలో పదిహేను రోజుల సమయం కావాలని సంఘం కోరింది. ఇందుకు నిరాకరించిన క్రీడల శాఖ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ఐవోఏకు కట్టబెట్టిన ప్రత్యేక అధికారాలన్నీ రద్దు అవుతాయి. అంతేకాదు ప్రభుత్వం నుంచి ఐవోఏకు ఎలాంటి ఆర్థిక సహకారం కూడా ఉండబోదని స్పష్టం చేశారు.
ఇది పూర్తి విరుద్ధం అందుకే నిర్ణయం
'ఐవోఏలో ఉన్న పరిపాలనకు ఇది పూర్తి విరుద్ధం. దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యలకు ఇది తల్లిలాంటిది. అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది జాతి ప్రతిష్ట, ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రభుత్వం కూడా ఒలింపిక్ చార్టర్కు చాలా గౌరవిస్తుంది. క్రీడల స్వతంత్రను కాపాడేందుకు మేం కట్టుబడి ఉన్నాం. కానీ ఐవోఏ ఉల్లంఘనలను చూస్తూ మౌనంగా ఉండలేం. దేశ ప్రతిష్టను పణంగా పెడుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవు. కళంకితులకు పదవులు ఇవ్వడం ద్వారా వాళ్ల సొంత రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారు' అని ఆయన మండిపడ్డారు.
ఐవోఏ ఉపాధ్యక్ష పదవికి నరీందర్ బాత్రా రాజీనామా
ఇదిలా ఉంటే సురేష్ కల్మాడీ, చౌతాలా పదవులపై ఐవోఏ వైఖరికి నిరసనగా సంఘం ఉపాధ్యక్ష పదవికి నరీందర్ బాత్రా శుక్రవారం రాజీనామా చేశాడు. ఒలింపిక్ సంఘం వైఖరిని వ్యతిరేకిస్తూ ఐవోఏ అసోసియేట్ ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఐవోఏ అధ్యక్షుడు రామచంద్రన్కు రాసిన లేఖలో బాత్రా పేర్కొన్నారు.
ఏజీఎం తీసుకున్న నిర్ణయంతో కలత చెందా
కళంకితులను దొడ్డిదారిన ఐవోఏలోకి తీసుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అంతర్జాతీయ హాకీ సంఘం అధ్యక్షుడు కూడా అయిన బాత్రా అన్నారు. ‘ఏజీఎం తీసుకున్న నిర్ణయంతో నేను కలత చెందా. జీవితకాల అధ్యక్షుల నామినేషన్ ప్రక్రియను చివరి అంశంగా తెరమీదికి తెచ్చారు. ఒకే ఒక్క నిమిషంలో దాన్ని పూర్తి చేసి ఏజీఎంను ముగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఐవోఏ నిబంధనలను తుంగలో తొక్కార'ని బాత్రా పేర్కొన్నాడు. 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా ఐవోఏ అధ్యక్షుడిగా ఉన్న కల్మాడీ అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.