ముంబై: ఐపీఎల్ 13 మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో అప్రతిష్టపాలైన ప్రముఖ క్రికెటర్, కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ నటి పూజాభట్ తదుపరి చిత్రంలో శ్రీశాంత్ కీలకపాత్ర పోషించనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఆ సినిమా పేరు 'క్యాబరే'. అందులో ఓ డ్యాన్సర్కు శ్రీశాంత్ మెంటార్గా వ్యవహరిస్తాడు. ఈ సినిమాకు కౌస్తవ్ నారాయణ్ నియోగి దర్శకులు. నియోగికి దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రఖ్యాత ఆడియో సంస్థ టి సిరీస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.
దీనిపై పూజా భట్ మాట్లాడుతూ.. ఈ నెల మొదట్లో శ్రీశాంత్ను అతడి పుట్టిన రోజుకి ఒకరోజు ముందు కలిశానని, సినిమాలో మలయాళీ మెంటార్ పాత్రకు శ్రీశాంత్ అతికినట్టు సరిపోతాడని తెలిపారు.
ఈ పాత్ర కోసం తాను పలువురిని చూశానని, కానీ శ్రీశాంత్ను చూసిన తర్వాత అతనే సరిపోతాడని భావించానని చెప్పారు. ఈ పాత్ర శ్రీశాంత్ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రీశాంత్ కెమెరా ఫ్రెండ్లీ అని, ఈ చిత్రం ద్వారా అతనికి మంచి పేరు వస్తుందని ఆకాంక్షించారు.
31 ఏళ్ల శ్రీశాంత్ గతంలో ఓ రియాల్టీ షోలో తన డ్యాన్స్ స్కిల్స్ చూపించాడు. డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ చిత్రం శ్రీశాంత్కి మంచి పేరు తీసుకు వస్తుందని చెప్పారు.
శ్రీశాంత్ గురించి పూజాభట్ మాట్లాడుతూ.. తాను గతంలో పలుమార్లు అతనిని కలిశానని చెప్పారు. శ్రీశాంత్ తన జీవితంలో ఎన్నో విజయాలు రుచి చూశాడని, అలాగే చేదు కూడా చూశాడని తెలిపారు. అతను ఈ సినిమా ద్వారా తనను తాను నిరూపించుకుంటారని పేర్కొన్నారు.