కొలంబో: గతేడాది నవంబర్లో శ్రీలంక మహిళా క్రికెట్లో సెక్స్ కుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే తమను లైంగికంగా సంతృప్తిపరచాలని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయని దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఓ రిటైర్డ్ మహిళా జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, విచారణ జరపాలని క్రికెట్ బోర్డును ఆదేశించారు. దీంతో సుప్రీం కోర్టు జడ్జి నిమల్ దిసనాయకే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. మహిళా క్రికెటర్లపై వచ్చిన సెక్స్ ఆరోపణలు నిజమేనని తేల్చింది.
శ్రీలంక జాతీయ మహిళా జట్టులోని చాలామంది మహిళా క్రికెటర్లు ఈ వేధింపుల బారినపడ్డారని కమిటీ పేర్కొంది. మహిళా క్రికెటర్లపై అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సాక్ష్యాలు లభించాయని క్రీడా మంత్రి తెలిపారు. దీంతో తప్పు చేసినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని క్రీడల మంత్రి మహీందానంద అలుత్ గామగే పేర్కొన్నారు.
శ్రీలంక మహిళా క్రికెట్లో సెక్స్ కుంభకోణం ఆరోపణలు వచ్చిన వెంటనే శ్రీలంక క్రికెట్ బోర్డు అక్టోబర్ 27న అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి సొంతంగా దర్యాప్తు మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. శ్రీలంక జాతీయ సెలక్టర్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య అధ్యక్షతన నలుగురు సభ్యుల ప్రోబ్ ప్యానల్ను నియమించింది.
ఈ ప్యానల్లో శ్రీలంక వైస్ ప్రెసిడెంట్ మోహన్ డిసిల్వా, సెక్రటరీ నిషాంతా రణతుంగ, అసిస్టెంట్ సెక్రటరీ హిరంతా ఫెరారాలు ఉన్నారు. అక్టోబర్ 30 (గురువారం)న ఈ కమిటీ జాతీయ సెలక్టర్లు, టీమ్ ఆఫీసియల్స్ (టీమ్ మేనేజర్, కోచ్)లతో పాటుగా జాతీయ మహిళల జట్టు సభ్యులను విచారించి శ్రీలంక క్రికెట్ బోర్డుకి నివేదికను అందజేయమని ఆదేశించింది.
ఇక శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం వరల్డ్ వన్డే ర్యాంకింగ్స్లో ఆరో ర్యాంకులో ఉంది.