హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) గురువారం ర్యాంకులను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ 11 స్థానాలు ఎగబాకి 11వ స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇండోనేసియా ఓపెన్ సూపర్లో కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న సన్వాన్పై విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాంత్ ఒక్కసారిగా 11 స్థానాలు ఎగబాకి 51,603పాయింట్లతో 11వ ర్యాంకులో నిలిచాడు.
Srikanth Kidambi's victory at #IndonesiaSSP takes him to 11th spot in @bwfmedia's latest rankings. pic.twitter.com/Ho4DrZLhFK
— BAI Media (@BAI_Media) 22 June 2017
ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరిస్కి ముందు శ్రీకాంత్ 22వ స్థానంలో ఉన్నాడు. ఇక దక్షిణకొరియాకి చెందిన సన్ వాన్ 72,968 పాయింట్లతో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్ మాత్రం తమ ర్యాంకులను నిలుపుకోవడంలో విఫలమయ్యారు.
ఇటీవలే కెరీర్ బెస్ట్ ర్యాంకులో నిలిచిన పీవీ సింధు ఒక ర్యాంకును కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. సైనా నెహ్వాల్ కూడా ఒక ర్యాంకును కోల్పోయి 16వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల సింగిల్స్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇక భారత ఆటగాళ్లు భారత ఆటగాళ్లు అజయ్ జయరాం, సాయి ప్రణీత్ రెండేసి స్థానాలు కోల్పోయి వరుసగా 15, 16వ స్థానాల్లో నిలిచారు. ఇక సాయి ప్రణీత్ 4 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకుని దక్కించుకున్నాడు.