న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు ఎన్ శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పారు. ఇక పైన బీసీసీఐ కార్యనిర్వాహక సమావేశాలలో తాను పాల్గొనబోనని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు శ్రీనివాసన్ బేషరతు క్షమాపణలు చెప్పారు. న్యాయస్థానం ఆయన క్షమాపణలను అంగీకరించింది.
ఫిబ్రవరి 8వ తేదీన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడంపై శ్రీనివాసన్కు సుప్రీం కోర్టు నాలుగు రోజుల క్రితం అక్షింతలు వేసిన విషయం తెలిసిందే.
శ్రీనివాసన్కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం చురకలు అంటించింది. సుప్రీం తీర్పు స్ఫూర్తిని శ్రీనివాసన్ అర్థం చేసుకున్నట్లుగా లేదని వ్యాఖ్యానించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని చెబితే సమావేశాలకు అధ్యక్షత ఎలా వహిస్తారని ప్రశ్నించింది. శ్రీనివాసన్ బీసీసీఐ సమావేశాలకు హాజరు కావడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది.
అధ్యక్షత ఎలా వహిస్తారని ప్రశ్నించింది. శ్రీనివాసన్ తీరు తీర్పును అగౌరవపరిచినట్లుగా ఉందని పేర్కొంది. దీని పైన శ్రీనివాసన్ను తాము వివరణ కోరుతామని తెలిపింది. ఫిబ్రవరి 8న శ్రీని బీసీసీఐ సమావేశానికి హాజరయ్యారు. దీనికి శ్రీనివాసన్ క్షమాపణ చెప్పాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
శ్రీనివాసన్ ఆటకు గొప్ప సేవలు చేసి ఉండవచ్చునని, కానీ తమ తీర్పు తర్వాత ఆయన కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. దీనిపై శ్రీనివాసన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ... ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, కేవలం ఎన్నికల కోసం తేదీని మాత్రమే ఫిక్స్ చేశారని చెప్పారు. దీనిపై శ్రీనివాసన్ నేడు క్షమాపణలు చెప్పారు.