నాగ్పూర్: 9ఏళ్లపాటు టెస్ట్ సిరీస్ల్లో ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికాకు టీమిండియా షాకిచ్చింది. గడిచిన 9ఏళ్లలో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా 15 టెస్ట్ సిరీస్లను సొంతం చేసుకుంది. శుక్రవారం విసిఏ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో 124 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించిన విరాట్ కోహ్లీ సేన.. 4 టెస్టుల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.
కాగా, చివరిదైన నాలుగో టెస్ట్ డిసెంబర్ 3న న్యూఢిల్లీలో జరగనుంది. శుక్రవారంనాటి టెస్టులో ఓటమి పాలైన ప్రోటీస్ తన 9ఏళ్ల ఆధిపత్యాన్ని ముగించినట్లయింది. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా.. మొహాలిలో జరిగిన తొలి టెస్టులో 108 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మూడో టెస్టులో కూడా ఓడిపోయి సిరీస్ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా.. వరుసగా 15 టెస్ట్ సిరీస్లు గెలిచి అక్కడే ఆగిపోయింది. కాగా, వరుసగా 18 టెస్ట్ సిరీస్లు సాధించిన వెస్టిండీస్ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. 18 టెస్ట్ సిరీస్లు గెలిచిన అనంతరం జరిగిన సిరీస్లో ఆస్ట్రేలియా గెలవడంతో విండీస్ అక్కడికే ఆగిపోయింది. ఆ రికార్డు 16ఏళ్ల నుంచి అలాగే ఉంది.
15వరుస విజయాలతో 2001లో భారత పర్యటనకు వచ్చిన స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు కూడా అప్పుడు టీమిండియా షాకిచ్చింది. ముంబైలో గెలిచి ఆ సంఖ్యను 16కు చేర్చిన ఆస్ట్రేలియా అక్కడితోనే ఆగిపోయింది. ఎందుకంటే..కోల్కతాలో జరిగిన ప్రముఖ టెస్ట్ మ్యాచుల్లో ఒకటైన ఆ మ్యాచులో వివిఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు
ఈ టెస్టులో అప్పటికే ఫాలోఅన్లో టీమిండియాను లక్ష్మణ్, ద్రావిడ్ 180 పరుగులతో ఆదుకున్నారు. అదే మ్యాచులో హర్భజన్ సింగ్ 13 వికెట్లు తీయడంతో 171 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
2008లో కూడా వరుసగా 16 టెస్ట్ మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియాకు టీమిండియా షాకిచ్చింది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని టీమిండియా 72 పరుగులతో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్స్లో ఇదో రికార్డు.
కాగా, తాజాగా దక్షిణాఫ్రికాపై విజయంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొని తిరిగి జట్టులోకి వచ్చి అద్భుత ప్రతిభకనబర్చాడు. అశ్విన్ ఒక్క రెండో ఇన్నింగ్స్లోనే 7 వికెట్లు పడగొట్టాడు. మూడో టెస్టులో 310 పరుగులు చేసి గెలుపొందాల్సిన దక్షిణాఫ్రికా 185 పరుగులకే ఆలౌటై సిరీస్ను చేజార్చుకుంది.