న్యూఢిల్లీ: గత ఏడాది బీసీసీఐ అధ్యక్షుడిగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడవ ఎడిషన్కు సేవలందించినందుకు గాను రూ. 1.90 కోట్లు వేతనంగా ఇవ్వాలని బీసీసీఐని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అడిగినట్లు తెలుస్తోంది.
అత్యంత ఖరీదైన టోర్నమెంట్గా పిలవబడే ఐపీఎల్ని గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. వర్కింగ్ కమిటీ సమాచారం ప్రకారం పరిహారం కింద ఈ డబ్బుని తనకివ్వాల్సిందిగా బీసీసీఐకి గవాస్కర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతేడాది బీసీసీఐ-ఐపీఎల్ నిర్వహణ బాధ్యతలను అధ్యక్షుడి హోదాలో సునీల్ గవాస్కర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎలాంటి మీడియా పనుల్లో (టీవి కామెంటరీ, కాలమ్స్ రాయడం, మీడియా పండిట్) పాల్గొనకపోడవం చేత తనకు పరిహారం కింద రూ. 1.90 కోట్లను ఇవ్వాల్సిందిగా తన లేఖలో పేర్కొన్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్లో సునీల్ గవాస్కర్ టీవీ కామెంటర్ గానో లేదో మీడియా పండిట్గా కనిపిస్తూ డబ్బుని సంపాదిస్తుంటారు. అయితే గతేడాది ఐపీఎల్ సీజన్లో తాను బీసీసీఐ-ఐపీఎల్ అధ్యక్షడిగా ఉన్నందున అలాంటి వాటికి దూరంగా ఉన్న కారణంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా బీసీసీఐని లేఖలో కోరాడు.
ఈ లేఖకు స్పందించిన బీసీసీఐ, తాను అడిగిన డబ్బుని సునీల్ గవాస్కర్కు ఇచ్చేందుకు సిద్దమైనట్లు సీనియర్ అధికారి తెలిపారు. 'అయితే ఇప్పడు కాదు. సుప్రీం కోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతనే. అంతలో ఈ లెటర్ను బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ ముందు ఉంచుతాం' అని తెలిపారు.
'అయితే సునీల్ గవాస్కర్ అడిగినంత ఇస్తారా లేదా తగ్గించి ఇస్తారా అనేది మాత్రం బీసీసీఐ ఫైనాల్స్ కమిటీ చూసుకుంటుంది' అని తెలిపారు. టీమిండియా కోచ్గా డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ప్రపంచకప్తోనే ముగియడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనే అంశంపై బిసిసిఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన విషయం తెలిసిందే.
అయితే ఈ బాధ్యతలు దిగ్గజ త్రయం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలకు అప్పగించింది. ఈ ముగ్గురు దిగ్గజాల సలహాతో బిసిసిఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కొత్తకోచ్ను ఎంపిక చేయనున్నారు.