హైదరాబాద్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సయ్యద్ మోడీ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల విభాగంలో భారత్ నుంచి సెమీస్కు చేరుకున్న ఏకైక షట్లర్ పీవీ సింధు మాత్రమే. ఇక పురుషుల విభాగంలో భారత్కు
చెందిన నలుగురు షట్లర్లు సెమీస్కు చేరారు.
పురుషుల విభాగంలో దాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ అంచనాల మేరకు రాణించగా సమీర్ వర్మ, హర్షీల్ డాని తమకంటే మెరుగైన ర్యాంక్ క్రీడాకారులపై విజయాలను సొంతం చేసుకున్నారు. దీంతో పురుషుల విభాగంలో నలుగురు భారత ఆటగాళ్లే సెమీస్లో తలపడనున్నారు.
శుక్రవారం జరిగిన మహిళల విభాగంలో టాప్ సీడ్ పీవీ సింధు 21-15, 21-11తో భారత్కే చెందిన క్వాలిఫయర్ వైదేహీ చౌదరిపై ఘన విజయం సాధించింది. శనివారం జరిగే సెమీస్లో ఆమె ఫిత్రియాని (ఇండోనేషియా)ని ఎదుర్కొంటుంది. హోరా హోరీగా సాగిన మ్యాచ్లో
ఫిత్రియాని 21-17, 13-21, 23-21తో రితుపర్ణ దాస్పై విజయం సాధించింది.
మరో క్వార్టర్స్లో శ్రీ కృష్ణప్రియ 17-21, 15-21తో ఆరో సీడ్ హన్నా రమాదిని (ఇండోనేషియా) చేతిలో పరాజయంపాలైంది. ఇక పురుషుల క్వార్టర్స్లో మూడో సీడ్ శ్రీకాంత్ 21-12, 21-17 స్కోరుతో ఏడో సీడ్ జుల్ఫాద్లీ జుల్కిఫ్లీ (మలేసియా)ను చిత్తు చేశాడు. తొమ్మిదో సీడ్
సాయిప్రణీత్ 21-19, 12-21, 21-10తో భారత ఆటగాడు సౌరభ వర్మపై గెలిచాడు.
మరో ఇద్దరు భారత షట్లర్లు క్వార్టర్స్లో సంచలన విజయాలను నమోదు చేశారు. ఎనిమిదో సీడ్, జాతీయ చాంపియన్ సమీర్ వర్మ 21-15, 21-13తో రెండో సీడ్ క్రిస్టియాన్ విటింగస్ (డెన్మార్క్)ను చిత్తుగా ఓడించాడు. మరో క్వార్టర్స్లో 15వ సీడ్ హర్షీల్ డాని 21-16, 17-21,
21-11తో పన్నెండో సీడ్ ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)ను ఓడించాడు.
మహిళల డబుల్స్లో అశ్విని, సిక్కిరెడ్డి జోడీ సెమీస్ చేరింది. క్వార్టర్స్లో అశ్విని జంట 21-14, 21-18తో మీ కువాన్, లీ మెంగ్ (మలేసియా)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కి-ప్రణవ్ చోప్రా 21-16, 21-19తో యోగేంద్ర కృష్ణన్ -ప్రజక్తా సావంత్ను ఓడించి సెమీస్కు ప్రవేశించారు.