సిడ్నీ: తీవ్రమైన ఒత్తిడే ఆస్ట్రేలియాపై ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఓడిపోవడానికి కారణమైనట్లు కనిపిస్తోంది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదే మాట అన్నాడు. సెమీ ఫైనల్ మ్యాచులో ఒత్తిడిని అధిగమించలేకపోయామని అతను అన్నాడు. ఛేజింగ్లో భారత ఓపెనర్లు శుభారంభం అందించిన సద్వినియోగం చేసుకోలేకపోయామని అన్నాడు. వెంటవెంటనే కీలకమైన వికెట్లు కూలిపోవడం ప్రతికూల ప్రభావం చూపిందని కూడా అన్నాడు. తాను కూడా పూర్తి స్థాయిలో రాణించలేకపోయినట్లు అంగీకరించాడు.
ఆస్ట్రేలియా ఆరంభం చూస్తే స్కోరును 400 పరుగులు దాటిస్తుందని అనిపించింది. కానీ, ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చుకున్నప్పటికీ భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను కట్టడి చేయగలిగారు. ఆరంభంలో, చివరలో బౌలర్లు ఇచ్చిన భారీ పరుగులు కూడా భారత ఓటమికి కారణమయ్యాయి.
ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, భారత్ వంటి జట్టుకు దాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఆ భారీ స్కోరును ఛేదించడం ఎప్పుడూ లేని విధంగా బ్యాట్స్మెన్ ఒత్తిడికి గురైనట్లు కనిపించారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరులోనూ అది కనిపించింది. ప్రారంభంలోనే ఇద్దరికి కూడా లైఫ్ దొరికింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారు దూకుడుగా ఆడే ప్రయత్నం చేసి వికెట్లను కోల్పోయారు. బంతులను సంయమనంతో, సహనంతో ఎదుర్కుంటూ అవకాశం వచ్చినప్పుడు భారీ షాట్లకు వెళ్లే పాత పద్ధతిలో వారు, ముఖ్యంగా రోహిత్ శర్మ ఆడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది కావచ్చు.
అదే సమయంలో విరాట్ కోహ్లీ విఫలం కావడం భారత్ను మరింత ఒత్తిడికి గురి చేసింది. సురేష్ రైనా కూడా అదే ఒత్తిడికి గురైనట్లు కనిపించాడు. ఏ వేళలోనూ అత్యంత అనుభవాన్ని కనబరిచే కోహ్లీ అనవసరంగా వికెట్ను జార విడుచుకున్నట్లు కనిపించాడు. అదే రీతిలో రైనా కూడా. వన్డే స్పెషలిస్టుగా ప్రఖ్యాతి గాంచిన సురేష్ రైనా ధాటిగా పరుగులు చేయకుండా పెవిలియన్కు చేరుకోవడంతో భారత బ్యాట్స్మెన్ మరింత ఒత్తిడికి గురయ్యారు. కెప్టెన్ ధోనీ అవుట్ కావడంతో మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ధోనీ అవుట్ కాగానే ప్రేక్షకులు లేచిపోతూ వచ్చారు. దాదాపు 75 శాతం మంది ప్రేక్షకులు లేచిపోయినట్లు చెబుతున్నారు.
ఈ ఒత్తిడికి ప్రధాన కారణం, ఆస్ట్రేలియా అంటే బెదురు కూడా కావచ్చు. ప్రపంచ కప్ పోటీలకు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు, వన్డే సిరీస్ల్లో ధోనీ సేన చేతులెత్తేసింది. అదే సెమీ ఫైనల్ మ్యాచులోనూ కనిపించింది. కాగా, ఆస్ట్రేలియా బౌలర్లు విసిరిన బౌన్సర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్మెన్ తెగువ ప్రదర్శించలేకపోయారు. ఆ తెగువ ప్రదర్శించకపోవడానికి ఒత్తిడే కారణం కావచ్చు. అంచనాలు భారీగా ఉండడంతో ఆ అంచనాల మేరకు ఆడుతామా, లేదా అనే ఒత్తిడి కూడా భారత ఆటగాళ్లపై పనిచేసినట్లు కనిపిస్తోంది. మొత్తంగా, భారత్ భారత క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది.
కాగా, 28 ఏళ్ల తర్వాత భారత ఉపఖండం లేకుండా ఐసిసి ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. సైమీ ఫైనల్కు భారత్ ఒక్కటే చేరుకుంది. చివరగా, ఆతిథ్య జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా భారత్ను ఎదుర్కోవడంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. మానసికమైన ఒత్తిడిని భారత ఆటగాళ్లపై ప్రదర్శించింది. భారత ఆటగాళ్లపై ఉన్న ఒత్తిడిని తనకు అనుకూలంగా మలుచుకుంది.