సిడ్నీ: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్లు కలిసి కొత్త ట్వంటీ20 క్రికెట్ లీగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లతో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
'ది ఆస్ట్రేలియన్' పత్రిక కథనం ప్రకారం.. ఈ ట్వంటీ20 టోర్నీలు అమెరికాలో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి. ఈ కొత్త లీగ్లో ఆటగాళ్లకు ప్రతీ మ్యాచులో 25,000 డాలర్లు ఇవ్వనుంది.
ఈ టోర్నీలో రికీ పాంటింగ్, గ్లేన్ మెక్గ్రాత్, బ్రెట్ లీ, జాక్వెస్ కల్లిస్, ఆడాం గిల్క్రిస్ట్, మైకేల్ వా, ఆండ్రూ ఫ్లింటాఫ్, ఇతర మాజీ ఆటగాళ్లు ఆడనున్నారు. టెండూల్కర్, వార్న్లు ఇప్పటికే 28మంది మాజీ ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపారు.
'క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్'లో ఆడేందుకు బ్రెట్ లీ ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి కోసం సంప్రదించినట్లు తెలిసింది. 'ఈ టోర్నీలో తప్పేమి కనిపించడం లేదు. రిటైరైన దిగ్గజాలు మ్యాచ్ ఆడటం మంచిదే' అని బ్రెట్ లీ మేనేజర్ నేల్ మాక్స్వెల్ చెప్పాడు.
కాగా, ఈ టోర్నీ న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో నగరాల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ టోర్నీ మొదలవుతుంది.