మనీలా: రెండు రోజుల క్రితం జరిగిన, బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్.. ఫ్లాయిడ్ మేవెదర్, మానీ పకియావ్ మధ్య జరగగా, ఇందులో మేవెదర్ విజయం సాధించారు. అయితే, దీనిపై పకియావ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. మేవెదర్ దొంగ దెబ్బ తీశాడని, తమ శిబిరంలోనే ఎవరో ద్రోహి ఉండి ఉంటారని పకియావ్ తీవ్ర ఆరోపణలు చేశాడు.
పకియావ్ తన దేశం ఫిలిప్సీన్ చేరుకున్నాడు. స్వదేశానికి చేరుకున్న అనంతరం పకియావ్ మాట్లాడుతూ.. తనను మేవెదర్ దొంగ దెబ్బ తీశాడని సంచలన ఆరోపణ చేశాడు. మేవెదర్ శిబిరం తనపై గూఢచర్యం చేసిందన్నాడు. తాను గాయంతో బాధపడుతున్న విషయం మేవెదర్కు ముందే తెలుసని, అందుకే బౌట్లో అతడు తన ఎడమ చేతిని పదేపదే లాగేందుకు ప్రయత్నించాడని పకియావ్ అన్నాడు.
తన చేతిని లాగేందుకు అతడు పదేపదే ప్రయత్నించడం మీరందరూ చూశారని, అతడికి తన గాయం సంగతి ముందే తెలుసునని, బహుశా తమ వాళ్లలోనే ఎవరో ఈ విషయాన్ని అతడికి చేరవేసి ఉంటారన్నాడు. గాయం సంగతి రహస్యంగానే ఉంచామని, ఎలా ఈ సమాచారం బయటికి పొక్కిందో అర్థం కావడం లేదని పకియావో శిబిరంలోని జాన్సన్ అన్నాడు.
పకియావ్ ఎలా సన్నద్ధమవుతున్నాడన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మేవెదర్ మనషులు తెలుసుకుంటూనే ఉండేవారని ఫిలిప్పీన్స్ పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. ఆ ఆరోపణలను మేవెదర్ శిబిరం కొట్టిపారేసింది. చేతిని లాగడం మేవెదర్కు కొత్తేమీ కాదని, ప్రతి పోరులోనూ అతడు అలాగే చేస్తాడని పేర్కొంది.