హైదరాబాద్: టెన్సిస్ క్రీడాకారిణి 18ఏళ్ల షేక్ జాఫ్రిన్ జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సాధించింది. డెఫ్(బధిరుల) ఛాంపియన్ షిప్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తోంది. అయినా ఆమెకు తగిన ఆర్థిక ప్రోత్సహాకాలు అందడం లేదు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆమెకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలపై ఉంది.
ప్రస్తుతం జాఫ్రిన్ తైవాన్లో జరిగే ఆసియా పిసిఫిక్ ఛాంపియన్షిప్ టోర్నీకి సిద్ధమైంది. కాగా, ప్రపంచ ఛాంపియన్కు జాఫ్రిన్ నాయకత్వంలోని టీం సభ్యులందరూ తైవాన్ బయల్దేరగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా జాఫ్రిన్ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. దీంతో జాఫ్రిన్ తండ్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన కూతురు టోర్నీకి వెళ్లలేకపోతోందని వాపోయాడు.
అక్టోబర్ 3 నుంచి 11 వరకు ఈ ఆసియా పసిఫిక్ ఛాంపియన్షిప్కు టోర్నీకి జాఫ్రిన్ను పంపించాలని ఆమె తండ్రి జకీర్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 'నా కూతురును తైవాన్ పంపించేందుకు అందరూ సహకరించాలి. మనం మళ్లీ ప్రపంచ ఛాంపియన్గా నిలవాలంటే ఈ పని చేయాల్సిందే' అని జకీర్ మీడియాకు తెలిపాడు.
రెండు నెలల క్రితం బధిరుల ప్రపంచ ఛాంపియన్ కోసం వెళ్లే భారత బృందానికి జాఫ్రిన్ కెప్టెన్గా ఎంపికైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జాఫ్రిన్.. తైవాన్కు వెళ్లలేకపోయింది.
'జాఫ్రిన్ మినహా మొత్తం టీం అంతా తైవాన్ వెళ్లిపోయారు. కాగా, ఆర్గనైజింగ్ కమిటీ 100డాలర్లను జాఫ్రిన్కు జరిమానాగా విధించింది. ఇప్పుడు ఆమె ర్యాంకు 17 నుంచి 22కు పడిపోయింది' అని న్యాయవాది అయిన జాఫ్రిన్ తండ్రి తెలిపాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే 2012లో లండన్లో జరిగిన పారాఒలింపిక్స్కు కూడా జాఫ్రిన్ పాల్గొనలేకపోయింది. అదే సంవత్సరం టెన్నిస్లో రాణించాలనే ఉద్దేశంతో కర్నూలు నుంచి హైదరాబాద్కు జాఫ్రిన్ కుటుంబం వలస వచ్చింది.
హైదరాబాద్లోని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అకాడమీలో జాఫ్రిన్ చేరింది. సానియా మీర్జా ఆర్థిక సహకారంతో ఆమె అక్కడే శిక్షణ తీసుకుంది. 'బధిరులుగా ఉండి టెన్నిస్లో జాఫ్రిన్లా అద్భుతంగా రాణించే వారు చాలా అరుదుగా ఉంటారు' అని సానియ అభిప్రాయపడింది.
ప్రపంచ ఛాంపియన్షిప్లో పాల్గొనాల్సిన జాఫ్రిన్కు స్పాన్సర్షిప్ అందించేందుకు ప్రభుత్వాలు, దాతలు ముందుకు రావాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు. తైవాన్కు టికెట్ కొనుగోలు చేసినప్పటికీ.. జాఫ్రిన్ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
'ఇప్పటి వరకు జాఫ్రిన్ పాల్గొన్న అన్ని టోర్నమెంట్లకు నా సొంత డబ్బునే ఖర్చు పెట్టాను. ఇక నా వల్ల కాదు. ఇదే ఆమెకు చివరి టోర్నమెంటు అవుతుందేమో. మాకు సహాయం అందకపోతే జాఫ్రిన్ ఇక ఆటకు దూరం కాక తప్పదు' అని జకీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
'గతంలో నేను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి లేఖ రాశాను. జాఫ్రిన్కు కావాల్సిన కొంత మొత్తాన్ని నేను సమకూర్చగలను, మొత్తం అయితే నేను ఇవ్వలేను అని లేఖలో పేర్కొన్నా. దీనికి స్పందించిన ఆయన.. స్పార్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్), జిల్లా కలెక్టర్కు సాయం అందించాలని సూచించారు' అని జకీర్ తెలిపాడు.
అయితే, 'బధిర, మూగ క్రీడాకారులకు ఎలాంటి ఆర్థిక సాయం అందించడం జరగదు' అని శాప్ తేల్చి చెప్పిందని జకీర్ తెలిపాడు. ఆ తర్వాత అనేక ప్రభుత్వ కార్యాలయాలయ చుట్టూ తిరిగినట్లు చెప్పాడు. చివరకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీని కలిశాను. అయినా తమకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపాడు.
ఈ నేపథ్యంలో జాఫ్రిన్ కుటుంబం స్పాన్సర్ షిప్ కోసం ఎదురుచూస్తోంది. 'మా భవిషత్య లక్ష్యం 2017లో టర్కీలో జరిగే బధిర ఒలింపిక్స్లో ప్రాతినిథ్యం వహించడమే' అని జకీర్ స్పష్టం చేశారు.
జాఫ్రిన్కు ఆర్థిక సాయం అందించాలనుకునే వారు జకీర్ అహ్మద్ ఫోన్ నెం. +919652826758ను సంప్రదించవచ్చు.