న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ఒలింపిక్ పతకాలు సాధించిన అథ్లెట్లకు డోప్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో డోపింగ్లో పట్టుబడుతున్న అథ్లెట్ల సంఖ్య నానాటికీ భారీగా పెరిగిపోతోంది. తాజాగా లండన్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలను సాధించిన ముగ్గురు కజకిస్థాన్ మహిళా వెయట్ లిఫ్టర్లు డోప్ పరీక్షలో పట్టుబడ్డారు.
దీంతో వారి నుంచి ఒలింపిక్ పతకాలను తిరిగి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ప్రకటించింది. ఇప్పటి వరకు లండన్, బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్ల నుంచి సేకరించిన వాటిలో 1240 శాంపిళ్లను పరీక్షించగా అందులో 98 పాజిటివ్గా తేలినట్టు ఐఒసి తెలిపింది.
ఒలింపిక్ అథ్లెట్ల శాంపిళ్లను పదేళ్లపాటు నిల్వ చేసి అత్యాధునిక పద్ధతుల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల జుల్ఫియా చిన్షాన్లో (53 కిలోలు), మైయా మనెజా (63 కిలోలు), స్వెత్లానా పొడొబెడొవా (75 కిలోలు) విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన ఈ ముగ్గురితో పాటు మరో ఐదుగురు డోపింగ్లో పాజిటివ్గా తేలినట్టు ఐఒసి ప్రకటించింది.
వీరంతా కూడా నిషేధిత స్టెరాయిడ్ స్టెనోజోల్ ఉపయోగించినట్టు పరీక్షలో తేలిందని ఐఒసి తెలిపింది. వీరిని వెయట్లిఫ్టింగ్ నుంచి సస్పెండ్ చేశామని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వారి పతకాలను కూడా రద్దు చేసినట్టు ఐఒసి తెలిపింది.
కాగా, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పతకాలు సాధించిన ఆరుగురు అథ్లెట్ల సహా తొమ్మిది మంది డోపింగ్లో పట్టుబడ్డారు. దీంతో వారి పతకాలను కూడా వెనక్కు తీసుకోనున్నారు. ఇంకా చాలా మంది ఈ జాబితాలో చేరుతారని అధికారులు అంటున్నారు. లండన్ ఒలింపిక్స్లో రజత పతకం గెల్చుకున్న రష్యన్ రెజ్లర్ బెసిక్ కుడొనొవ్ కూడా డోప్ పరీక్షలో విఫలమైన సంగతి తెలిసిందే.
దాంతో బెసిక్ కుడొనొవ్ సాధించిన రజత పతకం భారత్కు చెందిన రెజ్లర్ యోగేశ్వర్ దత్కు లభిస్తుందంటూ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే 2013లో జరిగిన ఓ కారు ప్రమాదంలో బెసిక్ కుడొనొవ్ మృతి చెందడంతో ఈ కేసుని మూసివేస్తున్నట్టు రష్యా ఒలింపిక్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది.