ఢాకా: ఐసిసి అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భారత యువ జట్టు దూసుకుపోతోంది. తొలి వామప్ మ్యాచులో గెలిచిన భారత్.. రెండో వామప్ మ్యాచులో దాయాది దేశం పాకిస్థాన్ జట్టుపై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సోమవారం జరిగిన ఈ మ్యాచులో భారత ఎడమచేతివాటం పేసర్ ఖలీల్ అహ్మద్ 5 వికెట్లు(5/30, 8ఓవర్లు) తీయడంతో 197 పరుగులకే పాకిస్థాన్ పరిమితమైంది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో సర్ఫరాజ్ ఖాన్ 68 బంతుల్లో 81(12 ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 33.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
బంగ్లాదేశ్లోని క్రిరా శిఖ్కా ప్రొటిస్థాన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచును పొగమంచు కారణంగా 45ఓవర్లకు కుదించారు. కాగా, గత శనివారం కెనడాతో జరిగిన మ్యాచును 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్న ఈ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతూ టోర్నీని సాధించేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంది.
కాగా, భారత్ గ్రూప్ డిలో ఉంది. ఈ గ్రూపులో ఐర్లాండ్, నేపాల్, న్యూజిలాండ్ ఉన్నాయి. జనవరి 28న అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీ తొలి మ్యాచ్ మిర్పూర్లో జరగనుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనుంది.
స్కోర్స్ వివరాలు:
పాకిస్థాన్ అండర్-19 జట్టు 44.1 ఓవర్లలో 197 పరుగుల చేసి ఆలౌటైంది. (మొహమ్మద్ ఉమర్ 36, హసన్ మోహసిన్ 33, సల్మాన్ ఫయాజ్ 29, గౌహర్ హఫీజ్ 25, (ఖలీల్ అహ్మద్ 5/30), భారత అండర్-19 జట్టు కేవలం 33.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. (సర్ఫరాజ్ ఖాన్ 81, వాషింగ్టన్ సుందర్ 28 నాటౌట్, మహిపాల్ లామ్రర్ 22 నాటౌట్, (హసన్ మోహసిన్ 2/23, షాబాద్ ఖాన్ 2/56).