హైదరాబాద్: సానియా మీర్జాకు ఇచ్చిన గౌరవాన్ని సైనా నెహ్వాల్కు కూడా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ బ్యాడ్మింట్న్ మహిళా క్రీడాకారుల్లో మొదటి ర్యాంకును సాధించిన తొలి భారతీయులు సైనా అని వీహెచ్ కొనియాడారు. అంతటి ఘనత సాధించిన సైనాకు కూడా సానియా మీర్జాకు ఇచ్చిన గౌరవం ఇవ్వాలని సూచించారు.
కాగా, సైనా నెహ్వాల్ రెండు రోజుల క్రితం ప్రపంచ నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఇండియన్ ఓపెన్ సిరీస్ గెలిచారు. స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సైనా సత్తాచాటారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా 21-16, 21-14తో రచనోక్ ఇంటనాన్ (థాయ్లాండ్)ను వరుస గేముల్లో మట్టికరిపించింది.
ఆరంభం నుంచే సైనా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. రచనోక్ ఆటను ఆమూలాగ్రం చదివిన సైనా కోర్టులో పాదరసంలా కదులుతూ పవర్ఫుల్ స్మాష్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. సెమీస్లో కరోలినా మారిన్ (స్పెయిన్)పై చెమటోడ్చి నెగ్గిన మూడో సీడ్ రచనోక్ ఈ మ్యాచ్లో కొంత అలసినట్టుగా కనిపించింది. మరోవైపు సైనాకు మద్దతుగా స్టేడియం మార్మోగడం కూడా ఆమె ఏకాగ్రతపై ప్రభావం చూపింది.
రెండో గేమ్ ఆరంభం నుంచే నెహ్వాల్ దూకుడు ప్రదర్శించింది. సైనాను రచనోక్ అడ్డుకునే ప్రయత్నం చేసినా సైనా ప్రతిఘటించింది. కానీ జోరు మీదున్న సైనా 21-14తో రెండో గేమ్ గెలుచుకుని తొలిసారిగా ఇండియా ఓపెన్ చాంపియన్గా అవతరించింది.
యువ సంచలనం శ్రీకాంత్ కూడా ఇండియన్ ఓపెన్ గెలుచుకున్నాడు. టాప్ ర్యాంక్ దక్కించుకున్న సైనాకు రూ.10 లక్షలు, ఇండియా ఓపెన్ విజేతగా నిలిచినందుకు శ్రీకాంత్కు రూ. 5 లక్షల నజరానాను భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) ప్రకటించింది.