హైదరాబాద్: నగరానికి చెందిన విరాట్ కార్తికేయ 11ఏళ్లకే క్రికెట్లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సిఏ) మూడు రోజుల లీగ్లో భాగంగా మంగళవారం ఇండియా సిమెంట్స్ తరపున మ్యాచ్ ఆడిన కార్తికేయ.. పిన్నవయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
సచిన్ 13ఏళ్ల వయసులో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో సంచలనం సృష్టించిన ముంబై యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా 12 ఏళ్ల తర్వాతే కాంపిటీటివ్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు తన ఫీట్తో వీరిద్దరినీ మరిపిస్తున్నాడు కార్తికేయ.
ఎడమ చేతి బ్యాట్స్మన్, ఆఫ్ స్పిన్నర్ అయిన కార్తికేయ ప్రస్తుతం మాజీ రంజీ క్రికెటర్ సయ్యద్ మిరాజ్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. టీమిండియాకు సచిన్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వివియస్ లక్ష్మణ్ స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను అందించాలన్న పట్టుదలతో ఉన్న సయ్యద్కు కార్తికేయ తురుపుముక్కగా దొరికాడు. నాలుగేళ్ల క్రితం కార్తికేయలోని ప్రతిభను గుర్తించిన సయ్యద్.. అతని ప్రతిభకు సానబెడుతూ మొత్తానికి 11 ఏళ్లకే హెచ్సీఏ లీగ్లో ఆడించగలిగాడు.
ఈ సందర్భంగా కార్తికేయ కోచ్ సయ్యద్ మాట్లాడుతూ.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న అతనిలో అద్భుత క్రికెటర్ దాగున్నాడని చెప్పారు. 4ఏళ్ల క్రితమే అతని ప్రతిభను గుర్తించి శిక్షణనివ్వడం ప్రారంభించానని తెలిపారు.
ఇంత చిన్నవయసులోనే అతను బ్యాటింగ్ చేసే తీరు, బౌలింగ్ విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. కార్తీకేయ భవిష్యత్లో గొప్ప క్రికెటర్ అవుతాడన్న నమ్మకం ఉందని సయ్యద్ అన్నారు. కార్తికేయ ఇదే వేగంతో ఎదుగుతూ త్వరలోనే రంజీలకు, అక్కడి నుంచి జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని ఆశిద్దాం.