ముంబై: బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ, భారత్ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ప్రేమాయణానికి సంబంధించిన ఊహాగానాలకు తెరపడింది. ఇక ఏ మాత్రం పుకార్లు పనిచేయని పరిస్థితి ఏర్పడింది. పుకార్లకు తెర దించుతూ అవును మేమిద్దరం ప్రేమించకుంటున్నామని, డేటింగ్ చేస్తున్నామని విరాట్ కోహ్లీ కుండ బద్దలు కొట్టాడు. తామిద్దరి మధ్య అనుబంధం వాస్తవమేనని అంగీకరించాడు. అయితే కనీస ఇంగితం ప్రదర్శించాలని తన బంధంపై పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్న వారిని కోరాడు.
'మేం ఏ విషయాన్నీ దాచిపెట్టడంలేదు. దాచాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. ఇప్పుడంతా బహిరంగమే. కానీ, అదే విషయాన్ని మీరు పదే పదే అడగడం సరికాదు. ఇద్దరం కలిసి ఎక్కడ కనిపించినా 'ఇది నిజమేనా.. ఖరారైనట్టేనా' అంటూ ఏవేవో అడుగుతున్నారు. కనీస ఇంగితం ప్రదర్శించండి. మీ అందరికీ తెలుసు. కానీ ఎందుకు పదే పదే అడుగుతుంటార'ని కోహ్లీ అన్నాడు. తమ మానాన తమను వదిలిపెట్టాలని, తమకు ప్రైవసీ కావాలని అన్నాడు.
ఇన్నాళ్లు దాగుడుమూతులు ఆడిన ప్రేమజంట బహిరంగంగానే తిరిగేస్తోంది. తాజాగా ఈ జంట ఢిల్లీ నుంచి వస్తూ ముంబై విమానాశ్రయంలో మీడియా కంటపడింది. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తూ కనిపించారు. వెంబడించిన మీడియాకు కారెక్కేముందు చేయి ఊపి బై చెప్పారు.
కాగా, గురువారం ఉదయమే ట్విట్టర్లో అంతుచిక్కని వ్యాఖ్యలతో విరాట్ కోహ్లి అభిమానుల్లో పెద్ద కలకలమే రేపాడు. నేనేం తప్పు చేశానో త్వరలోనే చెప్పబోతున్నా! లేదు లేదు.. నేనెలాంటి తప్పూ చేయలేదు..! కాదు నేను తప్పు చేశా! అంటూ కొన్ని ట్వీట్లు చేశాడు. మైదానంలో మాట్లాడేటప్పుడు గానీ, బౌలర్లను బాదేటప్పుడు కానీ ఏమాత్రం తటపటాయించని కోహ్లి తన ట్వీట్లతో అభిమానులను మాత్రం సందేహంలో పడేశాడు. దీంతో రకరకాల వూహాగానాలు చెలరేగాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు అనుష్కను తీసుకెళ్లాలా లేదా అన్న విషయంపై కోహ్లి సందిగ్థంలో ఉన్నాడని. ఆ నేపథ్యంలోనే ట్వీట్లు చేశాడని కొందరు.. కాదు కాదు.. ముద్గల్ నివేదికపై ఏదో విషయం చెబుతాడని మరికొందరు.. ఇలా ఆన్లైన్లో పెద్దస్థాయిలోనే చర్చ జరిగింది. చివరికి అందరి వూహాగానాలకు తెరదించాడు. తన పేరు మీద విడుదలవుతున్న దుస్తుల ప్రచార వ్యూహంలో భాగంగానే చేశానని కోహ్లి సెలవిచ్చాడు.
గతంలో ఉప్పల్లో భారత్, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మరో విశిష్ట అతిథి వచ్చారు. ఆ విశిష్ట అతిథి విరాట్ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క ఆదివారం మ్యాచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్లో కూర్చుని శ్రద్ధగా మ్యాచ్ చూసిన అనుష్క, కోహ్లి షాట్లు ఆడినపుడల్లా కేరింతలు కొట్టింది.
చతురంగ డిసిల్వా బౌలింగ్లో కోహ్లి సిక్సర్ బాది అర్ధసెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా 6 వేల మైలురాయి దాటిన ఆటగాడిగా రికార్డు అందుకున్న సమయంలో అనుష్క లేచి నిలబడి చప్పట్లతో అతణ్ని అభినందించింది. ఆ సమయంలో విరాట్ కూడా అనుష్కను మరిచిపోలేదు. అనుష్క వైపు బ్యాటు చూపిస్తూ.. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు.
ఇంగ్లాండ్ పర్యటనకు అనుష్కను వెంట తీసుకెళ్లేందుకు బీసీసీఐ నుంచి ప్రత్యేక అనుమతి కూడా సంపాదించాడు కోహ్లి. ఆ పర్యటనలో కోహ్లీ విఫలమవడానికి అనుష్క కారణమనే విమర్శలు కూడా వినిపించాయి. ఇటీవల ముంబైలోని ఓ హాస్పిటల్లో మీడియా కెమెరాలకు చిక్కిన విరాట్, అనుష్క ఆదివారం ఏకంగా స్టేడియానికే కలిసొచ్చారు. ఈ ప్రేమ జంట అందరికీ తెలిసేలా కనిపించడమిదే తొలిసారి.
విరాట్ తాను సహ యజమానిగా ఉన్న గోవా ఎఫ్సీ టీషర్టు ధరించి మ్యాచ్కు రాగా, అనుష్క కూడా అదే జెర్సీ వేసుకుంది. పుణెతో జరిగిన ఈ మ్యాచ్లో తన జట్టు ఓడిపోతుండటంతో కోహ్లి కాస్త కంగారుగా కనిపించాడు. అనుష్క మాత్రం సరదాగా గడిపింది. ఇటీవలే కోహ్లి, అనుష్క కుటుంబాలు ముంబయిలో కలుసుకున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కవచ్చని, ఆ నేపథ్యంలో బహిరంగంగా ఇలా కలుసుకున్నారని ప్రచారం జరుగుతోంది.