మెల్బోర్న్: భారత ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే వేగవంతమైన 7వేల పరుగులు సాధించిన ఆటగాడిగా ఏబి డివిలియర్స్ పేరున ఉన్న రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ను సైతం దాటేశాడు.
వేగవంతమైన సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పాంటింగ్ను అధిగమించాడు కోహ్లీ. అంతర్జాతీయ మ్యాచుల్లో వేగంగా 24 సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీ చేరిపోయాడు. మెల్బోర్న్ మైదానంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో 117 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
దీంతో పాంటింగ్ పేరిట ఉన్న వేగవంతంగా పూర్తి సెంచరీలు చేసిన రికార్డను కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో 24 వేగవంతమైన సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. ఆస్ట్రేలియా పర్యటనలో రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేయడం విశేషం.
169 మ్యాచుల్లో 161 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 24 సెంచరీలు నమోదు చేశాడు. కాగా, పాంటింగ్ 278 ఇన్నింగ్స్ల్లో 24 సెంచరీలు సాధించాడు. శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య 370 ఇన్నింగ్స్ల్లో, కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ సాధించారు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 219 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి ఎగబాకాడు. 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 30 సెంచరీలతో పాంటింగ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఓడిఐ టాప్-5 సెంచరీలు సాధించిన ఆటగాళ్లు
49- సచిన్ టెండూల్కర్(463 మ్యాచులు)
30- రికీ పాంటింగ్(375-ఆస్ట్రేలియా)
28-సనత్ జయసూర్య(445-శ్రీలంక)
25-కుమార సంగక్కర(404-శ్రీలంక)
24- విరాట్ కోహ్లీ(169 మ్యాచులు)