కోల్కతా: వన్డేల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డు (49 సెంచరీలు)ను కోహ్లీ అధిగమిస్తాడా అనేది ఆసక్తికరమైన చర్చనే. అయితే మాజీ కెప్టెన్ గంగూలీ మాత్రం కోహ్లీ ఆ రికార్డును అధిగమిస్తాడన్నట్టుగానే మాట్లాడాడు. "వన్డేల్లో కోహ్లీ ఇప్పటికే 22 సెంచరీలు కొట్టాడు. యాభై సెంచరీల కోసం అతనికింకా 28 సెంచరీలు అవసరం. ఎంతలేదన్నా మరో పదేండ్లు ఆడతాడు కాబట్టి చూద్దాం.. ఏం జరుగుతుందో" అని అన్నాడు.
ప్రతి ఒక్కరి రికార్డు కూడా బ్రేక్ అవుతుందని, అయితే సచిన్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డు మాత్రం సురక్షితమని, అది చిరకాలం నిలిచివుంటుందని గంగూలీ అన్నాడు. భారత జట్టు ఆటతీరును గంగూలీ ప్రశంసించాడు. ఇటీవలి టెస్టు, ముక్కోణపు వన్డే సిరీస్ల్లో అటతీరును చూస్తే ప్రపంచ కప్ పోటీల్లో భారత్ అద్భుతంగా రాణిస్తోందని అన్నాడు.
భారత్ దక్షిణాఫ్రికాను 130 పరుగుల తేడాతో ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదని, దాన్ని ఎవరూ అంచనా వేలేదని, భారత్ ఫామ్ దాని ద్వారా బయటపడిందని ఆయన అన్నాడు. నాకవుట్ దశలో ఎవరు నిలుస్తారో నిలువరో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. పక్షపాతంతో కూడిన సమాధానం కావాలంటే ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్కు చేరుకుంటాయని ఆయన అన్నాడు. వాస్తవమైన సమాధానం మాత్రం తనకు తెలియదని, ఎవరు ఎవరినైనా ఓడించవచ్చునని, అది అంచనాకు అందదని గంగూలీ అన్నాడు.
కలకత్తా క్రీడా జర్నలిస్టుల క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించాడు. నాకవుట్ దశలో ఆ రోజును బట్టి ఉంటుందని, ఆ రోజు ఎవరు ఎవరినైనా ఓడించవచ్చునని ఆయన అన్నాడు. టాస్ ఓడిపోతే ధోనీ జట్టు ఎలా ఆడుతుందనేది చూడాలని గంగూలీ చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానించాడు. రెండు సార్లు కూడా ఇండియా టాస్ గెలుచుకుందనే విషయాన్ని గమనిస్తే టాస్ ఓడితే ఎలా ఆడుతుందనేది చూడాలని అన్నాడు.