రియో డీ జనీరో: గురువారం రాత్రి నుంచి యావత్ భారతావని 'గో గోల్డ్' అని నినదిస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడు. రియో ఒలింపిక్స్లో శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
ఈ క్రమంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండిస్ నుంచి వీడియో రూపంలో ట్విట్టర్ ద్వారా సింధుకు తన విషెస్ తెలియజేశాడు. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్స్లో వరల్డ్ 10వ ర్యాంక్లో సిందు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా(జపాన్)పై విజయాన్ని సాధించి ఫైనల్కు చేరుకుంది.
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో ఫైనల్కు చేరిన తొలి భారత షట్లర్గా సింధు చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగే మ్యాచ్లో కూడా విజయం సాధిస్తే భారత బ్యాడ్మింటన్లో సింధు అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో సింధు భారత్కు స్వర్ణం తీసుకురావాలని యావత్ భారతావని ఆకాంక్షిస్తోంది.
ప్రస్తుతం వెస్టిండిస్లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో 4వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సింధుకు మైక్రో బ్లాగింగ్ వెస్సైట్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో సందేశాన్ని పంపాడు. తన ట్విట్టర్ పేజిలో సెమీ ఫైనల్స్లో విజయం సాధించిన సింధుకు శుభాకాంక్షలు తెలిపుతూ ఛాంపియన్గా అభివర్ణించాడు.
All the very best @Pvsindhu1
— Virat Kohli (@imVkohli) 19 August 2016
This is gonna be an epic final clash! #JaiHind #Rio2016 pic.twitter.com/6mGCf0JzcZ
ఫైనల్స్లో జరిగే మ్యాచ్లో సింధు ఓడినప్పటికీ వెండి పతకంతో కొత్త చరిత్రను సృష్టించడం ఇప్పటికే ఖాయమైపోయింది. రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి వెండి పతకం సాధించినందుకు సింధుకు అభినందనలు తెలుపుతూ కోహ్లీ తన వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.
వెస్టిండిస్ నుంచి నీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్న కోహ్లీ, మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ నువ్వు మా ఛాంపియన్వి అంటూ అందులో పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే సైతం సింధుకు ఆల్ ద బెస్ట్ చెప్తూ తన సందేశాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.
Head Coach @anilkumble1074's message for @Pvsindhu1 on behalf of the Indian Cricket Team #GoForGoldSindhuhttps://t.co/5Aoi7CmRLv
— BCCI (@BCCI) 19 August 2016
ఇదిలా ఉంటే భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు రియో ఒలింపిక్స్ ఫైనల్ చేరిన సందర్భంగా దేశవ్యాప్తంగా 'గో గోల్డ్' అనే నినాదం మారుమ్రోగిపోతుంది. రియో ఒలింపిక్స్లో సింధు గోల్డ్ మెడల్ సాధించాలంటూ దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.