రాంచీ: తన జట్టులోని హిట్టర్లపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. సురేష్ రైనాను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్తో శుక్రవారం జరిగిన మ్యాచులో రెండు బంతులు ఆడి అనవసరమైన షాట్కు వెళ్లి సున్నా పరుగులకు సురేష్ రైనా అవుట్ కావడంపై ధోనీ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
ముంబై ఇండియన్స్తో రేపు ఆదివారం జరిగే మ్యాచులో కాస్తా వివేకంగా ఆడాలని ఆయన హిట్టర్లకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చెన్నై బ్యాట్స్మెన్ తీవ్రంగా చెమటోడ్చారు. మ్యాచ్ పోటాపోటీగా జరగడంపై రవిశాస్త్రి ప్రస్తావించగా, ఫైనల్ ముందుకు బాగా సన్నద్ధమవుతామని ధోనీ చెప్పాడు.
ప్రేక్షకులను అలరించడంతో పాటు లక్ష్య ఛేదనకు అవసరమైన ప్రణాళిక కూడా ఆటగాడికి అవసరమని ధోనీ వ్యాఖ్యానించాడు. ప్రతి గేమ్ ఆడడాన్ని అలవాటు చేసుకున్నామని, అదే సమస్య అని, ఒక్క మ్యాచ్ నుంచి మరో మ్యాచుకు తాము పరిణతి సాధించామని అన్నాడు.
ఏది అవసరమో అదే ఆడడం అవసరమని ఆయన అన్నాడు. కొన్ని సందర్భాల్లో తాము కొన్ని భారీ షాట్లు ఆడడాన్ని చూశామని, నిజానికి అది ఆ సందర్భంలో అవసరం లేదని, లక్ష్య ఛేదన చేస్తున్నప్పుడు ప్రత్యర్థి జట్టు ఎంత స్కోరు చేసిందో అంత స్కోరు చేస్తూ పోవడం ముఖ్యమని అన్నాడు. ప్రత్యర్థి జట్టు చేసిన స్కోరు కన్నా పది పరుగులు ఎక్కువ చేయడం అవసరం లేదని అన్నాడు.
19వ ఓవరులో విజయం సాధించినా అది ఎంతో మేలైన విషయమని ధోనీ అన్నాడు. ఈ విషయంలో తాను మెరుగు పడాల్సి ఉందని కూడా అన్నాడు. క్రికెట్ ప్రేక్షకులను అలరించడానికనేది నిజమేనని, చివరగా 140 పరుగులు చేయాల్సి ఉండగా అన్ని పరుగులే చేయాలని, ప్రతి బంతినీ సిక్స్ కొట్టి 145 పరుగులు చేయాల్సిన అవసరం లేదని ధోనీ అన్నాడు.
రాయల్ చాలెంజర్స్ జట్టుతో జరిగిన మ్యాచులో 9.4 ఓవర్లలో బ్యాట్స్మెన్ మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేయడం పట్ల ధోనీ సంతృప్తిగానే ఉన్నట్లు కనిపించారు. అయితే, సురేష్ రైనా యుజర్వేంద్ర చాహల్ వేసిన బంతిని జాగ్రత్తగా గమనించకుండా బౌండరీకి తరలించాలనే ఉద్దేశంతో షాట్కు వెళ్లి ఔటయ్యాడు. ఇది ధోనీని తీవ్ర అసంతృప్తికి గురి చేసినట్లు భావిస్తున్నారు.