పెర్త్: టీమిండియాలో స్టార్ ఆటగాళ్ళున్నారని.. అయితే వారి పేర్లు, సామర్థ్యాన్ని చూసి తాము భయపడబోమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) కెప్టెన్ మొహ్మద్ తౌకిర్ తేల్చి చెప్పాడు. ఫిబ్రవరి 28 శనివారం రోజున ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్ జట్టుతో యుఏఈ తలపడనుంది. ఈ నేపథ్యంలో యుఏఈ కెప్టెన్ పై వ్యాఖ్యలు చేశాడు.
కాగా, ప్రపంచ కప్ టోర్నీలో ఈ రెండు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. టీమిండియాతో మ్యాచును ప్రత్యేకించి చూడమని తౌకిర్ తెలిపాడు. 'ఇటీవల జరిగిన రెండు మ్యాచుల్లో గమనించాం. టీమిండియాలో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారి పేర్లు, సామర్థ్యాన్ని చూసి మేం భయపడేది లేదు' అని కుడిచేతి వాటం బ్యాట్స్మన్ తౌకిర్ శుక్రవారం మాట్లాడుతూ తెలిపాడు.
42ఏళ్ల తౌకిర్ ఏడు అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో 5 ఇన్నింగ్స్ ఆడి 89 పరుగులు చేశాడు. అంతేగాక ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేసి 8 వికెట్లు కూడా తీసుకున్నాడు. 2004లో దంబుల్లా(శ్రీలంక)లో జరిగిన ఆసియా కప్లో టీమిండియాతో జరిగిన మ్యాచుతో తౌకిర్ అంతర్జాతీయ వన్డే కెరీర్ ప్రారంభించాడు. ఈ మ్యాచులో జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే లాంటి భారత బౌలర్లను ఎదుర్కొని అర్థ సెంచరీ చేశాడు.
ప్రపంచ కప్ 2015లో యుఏఈ జట్టుకు ఇది నాలుగో మ్యాచ్. జింబాబ్వే, ఐర్లాండ్లతో జరిగిన మ్యాచుల్లో ఓటమి పాలైన అఫ్ఘాన్.. స్కాట్లాండ్ను ఓడించి ప్రపంచ కప్ టోర్నీలో తొలి గెలుపును అందుకుంది. తాము తమ ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూనే ఉన్నామని తౌకిర్ చెప్పాడు. అయితే తమ జట్టుకు ఫుల్ టైమ్ ఆటగాళ్లు లేరని తెలిపాడు. భారత సంతతికి చెందిన కృష్ణ చంద్రన్, స్వప్నిల్ పాటిల్ కూడా అప్ఘాన్ జట్టులో ఉన్నారు. 1996 ప్రపంచ కప్ తర్వాత యుఏఈ ఈసారి ప్రపంచ కప్లో పాల్గొంటోంది.