కోల్కతా: భారత జట్టు ఓటమి, విరాట్ కోహ్లీ వైఫల్యం నేపథ్యంలో అభిమానులు బాలీవుడ్ నటి అనుష్క శర్మ పైన కారాలు మిరియాలు నూరుతున్నారు. దీని పైన మాజీ భారత క్రికెట్ సారథి సౌరవ్ గంగూలీ ధీటుగా స్పందించాడు. సామాజిక మాధ్యమాల్లో అనుష్క పైన చేస్తున్న కామెంట్ల పైన గుంగూలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అనుష్క చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. ఇతర ఆటగాళ్ల సన్నిహితులు, కుటుంబ సభ్యుల లాగే ఆమె కూడా మ్యాచ్ చూసేందుకు వెళ్లిందని, కోహ్లీ విఫలమైతే అనుష్కను నిందించడం ఎంత వరకు సమంజసమన్నాడు. అలా చేస్తున్న వారికి మానసిక పరిపక్వత లేదన్నాడు.
కోహ్లీ వేసిన ఒక ఓవర్ డ్రాప్ చేసిన ఒక క్యాచ్ చేసిన ఒక పరుగు చూసేందుకేనా అనుష్క ఆసీస్ ఫ్లయిట్ ఎక్కింది.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పరుగు ఇది.. కోహ్లీ చేసిన ఒక్క పరుగు చూడ్డానికి అనుష్క ఆసీస్కు వచ్చింది అంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి.
దీనిపై గంగూలీ స్పందిస్తూ.. అనుష్క ఏం తప్పు చేసింది? కోహ్లీ ప్రదర్శనకు ఆమెను నిందించడం సమంజసం కాదని, టీమిండియా ఓటమిలో ఆమె పాత్ర లేదన్నాడు. సామాజిక అనుసంధాన వేదికల్లో అనుష్కకు వ్యతిరేకంగా అభిమానులు కామెంట్లు చాలా చేస్తున్నారు. అలాగే మద్దతిస్తున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. అనుష్కను నిందిస్తున్న వారికి బుద్ది లేదని మద్దతు పలికారు.