హైదరాబాద్: డబుల్స్ విభాగంలో తాను సాధించిన నెంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకునేందుక కృషి చేస్తానని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తెలిపింది. వీలైనంత ఎక్కువ కాలం అగ్రస్థానంలో కొనసాగడానికి ఎంతైనా శ్రమించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫెడ్ కప్ టోర్నీలో సానియా మిర్జా సారథ్యంలో భారత్ను విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అనంతరం సానియా మిర్జా మాట్లాడుతూ "భవిష్యత్తు గురించి చెప్పలేను. నెంబర్ వన్ ర్యాంకును సాధించడం నాతో పాటు ఎంతో మందికి ఆనందం కలిగించింది. ఈ అగ్రస్ధానాన్ని కాపాడుకోవడానికి నేను చేయవలసినదంతా చేస్తా"నని చెప్పారు.
ఇక శనివారం రాత్రి ఫిలిఫ్పీన్స్తో జరిగిన ఫైనల్లో ప్రార్ధనా తోంబరేతో బరిలోకి దిగిన సానియా భారత్ను విజేతగా నిలిపింది. "నంబర్ వన్ క్రీడాకారిణిగా హైదరాబాద్లో ఆడడం ఆనందాన్నిచ్చింది. ఈ ర్యాంక్ సాధించిన తర్వాత ఆడిన తొలి టోర్నీ ఇది. అయితే ఈ విజయం అంత సులభం కాదు. మాపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల నేను ఎక్కువగా క్లే కోర్టుల పైనే ఆడాను. ఇప్పుడు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటం కాస్త ఇబ్బంది కలిగించింది" అని చెప్పారు.
ఇక ఈ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ప్రార్ధనా తోంబరే, అంకితా రైనాలను సానియా ప్రశంసలతో ముంచెత్తారు. యువ క్రీడాకారులతో ఆడటం సంతోషంగా ఉందని, వీళ్లు భవిష్యత్తులో భారత్కు అద్భుత విజయాలను అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వీరి ఆట తీరు మెరుగుపడుతున్నదని, త్వరలోనే వారు ప్రపంచ స్ధాయి క్రీడాకారిణులుగా ఎదుగుతారని చెప్పారు. వచ్చే ఏడాది జరగే పెడ్ కప్ గ్రూప్ 1 ఈవెంట్లో బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ వచ్చే ఏడాదికి టెన్నిస్ నుంచి రిటైర్ కానిపక్షంలో ఖచ్చితంగా ఆడతానని బదులిచ్చారు. మరో రెండేళ్లలో ఫెడ్కప్లో ప్రపంచ గ్రూప్నకు అర్హత సాధిస్తామన్న నమ్మకం కూడా ఉందని సానియా పేర్కొన్నారు.