బెంగుళూరు : యూరీ ఉగ్ర ఘటన తర్వాత పాక్ పై ప్రతీ ఒక్క భారతీయుడిలో ప్రతీకారేచ్చ రగులుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ సహానం కోల్పోకుండా వ్యవహరిస్తోన్న భారత్ పాక్ చర్యలను వ్యూహాత్మకంగా ఎండగడుతోంది. ఇక ఇప్పుడు హాకి క్రీడాకారుల వంతు. వచ్చే నెలలో పాక్ తో జరగబోయే మ్యాచ్ లో దేశ సైనికుల కోసం పాక్ ను చిత్తుగా ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ తెలిపాడు.
కాగా, మలేషియా వేదికగా వచ్చే నెల 20నుంచి 30 వరకు హాకి టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా భారత్-పాక్ ముఖాముఖి తలపడనున్నాయి. యూరీ ఉగ్ర ఘటన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ప్రతీ కదలిక ప్రాధాన్యతను సంతరించుకుంటుండడంతో.. సహజంగానే రెండు దేశాల మధ్య మ్యాచ్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో పాక్ చేతిలో ఓడిపోయి మన సైనికులను నిరాశపరచబోమని ఇప్పుడే వాగ్దానం చేసేశాడు భారత హాకి కెప్టెన్.
భారత్-పాక్ దాయాదుల మధ్య మ్యాచ్ అంటే.. ప్రతీ ఒక్కరూ ఉత్కంఠతో చూస్తారు. 'వందశాతం కష్టపడడానికి ప్రయత్నిస్తాం. మ్యాచ్ లో ఓడిపోయి మన సైనికులను మాత్రం నిరుత్సాహపరచం.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కోసమైనా పాక్ పై గెలుపు సాధిస్తాం' అని తెలిపాడు శ్రీజేష్.
ప్రస్తుత పాక్ హాకి జట్టు ఆటతీరు అంత ప్రభావం చూపేదిగా లేదన్న శ్రీజేష్.. తొలిసారిగా పాక్ ఒలింపిక్స్ కు అర్హత సాధించని విషయాన్ని గుర్తు చేశాడు. అయితే తనదైన రోజున చెలరేగి ఆడే సత్తా పాక్ లో ఉందని శ్రీజేష్ అభిప్రాయపడ్డాడు. టోర్నమెంట్ లో మలేషియా, కొరియా జట్లను తక్కువ అంచనా వేయడానికి లేదని చెప్పుకొచ్చాడు.