బెంగుళూరు: 2010లో 'ఆసియా జూనియర్ స్క్వాష్ టైటిల్' ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా రవి దీక్షిత్ చరిత్ర సృష్టించాడు. ఐదు సంవత్సరాల తర్వాత అదే రవిదీక్షిత్ తన ట్రైనింగ్ కోసం డబ్బులు లేక తన 'కిడ్నీ'ని అమ్ముకునే స్థాయికి చేరాడు. ఇది మన దేశంలో స్క్వాష్ ఆటగాళ్ల దుస్థితి.
నాలుగు రోజుల్లో (జనవరి 16)న తన 24వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైన రవి దీక్షిత్ తన ఫేస్బుక్లో రూ. 8 లక్షలకు తన కిడ్నీని అమ్మేందుకు సిద్ధమైనట్లు పోస్టు చేశాడు. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో ఇప్పుడు హాల్ చల్ సృష్టిస్తోంది.
'గత పదేళ్లుగా స్క్వాష్ ఆడుతున్నాను. భారత్ తరుపున ఎన్నో మ్యాచ్లను నేను చాలా సందర్భాల్లో ఎన్నో పతకాలను గెలిచాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి స్క్వాష్ ఆటను తీసుకెళ్లేందుకు నాకెలాంటి మద్దతు లభించలేదు' అని పేర్కొన్నాడు.
'ధంపూర్ సుగర్ మిల్ నాకు మద్దతుగా నిలిచినా ఎంత కాలం తన మద్దతుని కొనసాగిస్తుంది. వచ్చే నెలలో గౌహతిలో మొదలుకానున్న గేమ్స్కు భారత్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ టోర్నమెంట్కు సన్నద్ధం కావడానికి చెన్నైలో ట్రైనింగ్కు వెళ్తున్నాను. అందుకు సరిపడ డబ్బు నా దగ్గర లేదు. నేను నా సంకల్పం కోల్పోయాను' అని అందులో పేర్కొన్నాడు.
ఇందులో భాగంగా 'నేను నా కిడ్నీ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎవరికైనా కిడ్నీ అవసరమైతే నన్ను సంప్రదించండి. నా కిడ్నీ ఖరీదు రూ. 8 లక్షలు.' అని తన ఫేస్బుక్లో ఆదివారం (జనవరి)న పోస్టు చేశాడు. దీనిపై కంగారు పడిన రవి దీక్షిత్ తండ్రి మాట్లాడుతూ నేను రవితో ఫోన్లో మాట్లాడానని, ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడని తెలిపారు.
రవి దీక్షిత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ సంక్షోభాన్ని తామిద్దరం ధైర్యంగా ఎదుర్కొంటామని తన కుమారుడికి తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకు నా కుమారుడు అంగీకరించలేదన్నారు.
తన కుమారుడు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తమను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. రవి దీక్షిత్ సాధించిన విజయాలతో తన కుమార్తెకు పెళ్లి చేశామని ఆయన ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో రవి దీక్షిత్ 211 ర్యాంకులో ఉన్నారు. జులై 2010న శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన అండర్-19 ఆసియా జూనియర్ ఇండివిడ్యువల్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలిచి చరిత్ర సృష్టించారు.