కొలంబో: క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలంటే లైంగిక కోరిక తీర్చాల్సిందేనని పై అధికారులు వేధింపులకు దిగారు. బాధితులు ఫిర్యాదులు చెయ్యడంతో సంఘటనపై దర్యాప్తు జరిగింది. దర్యాప్తులో సదరు అధికారులు మహిళ క్రికెటర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూసింది.
శ్రీలంకలో జరిగి ఈ దారుణ సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీలంక మహిళ క్రికెటర్ల జట్టు ఎంపికలో క్రీడా శాఖ అధికారులు దారుణంగా ప్రవర్థించారు. మిమ్మల్ని క్రికెట్ జట్టులోకి తీసుకొవాలంటే తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశారు.
బాధితులు గత నవంబర్ లో ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వం సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నిమల్ దిస్సానాయకే సారధ్యంలోని ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటి వేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
రిటైర్డ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. విచారణ నివేదికను శ్రీలంక క్రీడల శాఖకు అందించారు. శ్రీలంక మహిళ క్రికెట్ మేనేజ్ మెంట్ టీమ్ సభ్యులు మహిళ క్రికెటర్లను లైంగికంగా వేధించారని ఆధారాలు ఉన్నాయని నివేదిక వెల్లడించిన విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అంగీకరించింది.
మహిళ క్రికెటర్లను లైంగిక వేధింపులకు గురి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీలంక క్రీడల శాఖ అధికారులు తెలిపారు. అయితే మహిళ క్రికెటర్లను వేధించిన అధికారుల పేర్లు చెప్పడానికి శ్రీలంక క్రీడా శాఖ అధికారులు నిరాకరించారు.