హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ చాంపియన్షిప్లో కూడా తన జోరును కొనసాగిస్తున్నాడు. సోమవారం మొదలైన ఈ టోర్నీలో ఎనిమిదో సీడ్గా బరిలోకి దిగిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. పెద్దగా శ్రమించకుండానే రెండో రౌండ్లో అడుగుపెట్టాడు.
తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-13, 21-12తో కేవలం 29 నిమిషాల్లో సెర్గీ సిరాంట్ (రష్యా)ను ఓడించాడు. ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ విజయాలతో అద్భుతమైన ఫామ్లో ఉన్న శ్రీకాంత్ ముందు సిరాంత్ తేలిపోయాడు. తొలి గేమ్ ఆరంభంలో కాస్త తడబడ్డ శ్రీకాంత్ వెంటనే తేరుకొని తనశైలిలో విజృంభించాడు.
కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించాడు. నెట్ దగ్గర అద్భుతంగా ఆడిన శ్రీకాంత్ కళ్లు చెదిరే స్మాష్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. తొలి గేమ్లో 11-6తో ఆధిక్యం సంపాదించిన శ్రీకాంత్ ఆ తర్వాత అదే దూకుడుతో తన ఆధిక్యాన్ని 15-7కు పెంచుకున్నాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడి 21-13తో తొలి గేమ్ని సొంతం చేసుకున్నాడు.
ఇక, రెండో గేమ్లోనూ శ్రీకాంత్ చెలరేగాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పాయింట్లు రాబట్టాడు. ఏ దశలోనూ శ్రీకాంత్ నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆడుతూ నిలకడగా పాయింట్లు సాధించి 21-12తో రెండో గేమ్ను, మ్యాచ్ను గెల్చుకున్నాడు. రెండో రౌండ్లో లూకాస్ కార్వీ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్ తలపడనున్నాడు.
పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ సైతం రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. పాబ్లో అబియన్ (స్పెయిన్)తో మ్యాచ్లో తొలి గేమ్ను 21-8తో గెలుచుకున్న సమీర్.. రెండో గేమ్లో 17-4తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్-మనీషాల జోడీ 24-22, 21-17తో టామ్ చున్ హీ-ఎన్జీ సాజ్ యావు (హాంకాంగ్) జోడీపై నెగ్గి రెండో రౌండ్కు చేరుకుంది. పురుషుల డబుల్స్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జోడీ తొలి రౌండ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తన్వీ లాడ్ (భారత్) 17-21, 21-10, 21-19తో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)ను ఓడించింది. మరో మ్యాచ్లో ప్రాజక్తా సావంత్ (భారత్)-యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జంట 21-15, 13-21, 21-18తో లియు చింగ్ యావో-చియాంగ్ కయ్ సిన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఆరతి సారా సునీల్-సంజన సంతోష్ (భారత్) జంట 21-15, 21-18తో నటాల్యా వ్యోట్సెక్-యెలజెవెటా జర్కా (ఉక్రెయిన్) జోడీపై విజయం సాధించింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్లకు తొలి రౌండ్లో బై లభించిన సంగతి తెలిసిందే.
దీంతో మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కిమ్ హ్యో మిన్ (కొరియా)తో పీవీ సింధు, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వీ నాన్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్, వ్రాబెర్ (ఆస్ట్రియా)తో అజయ్ జయరామ్ తలపడనున్నారు.