సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన కుమార సంగక్కరను చూసి ఇతర జట్లు భయపడుతున్నాయని శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యానించాడు.
కుమార సంగక్కర రూపంలో వన్డే క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ను శ్రీలంక కలిగి ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి వెబ్ సైట్కు రాసిన కాలమ్లో ముత్తయ్య అభిప్రాయపడ్డాడు. "మీరు విరాట్ కోహ్లీ, ఏబీ డెవిలియర్స్ లేదా మ్యాక్స్ వెల్ గురించి మాట్లాడుకోవచ్చు. వీరంతా ప్రస్తుత టోర్నమెంట్లో అధ్బుతంగా రాణిస్తున్నారు. అయితే సంగక్కర మాత్రం అన్ని జట్లను భయపెడుతున్నాడు" అని మురళీధరన్ అన్నాడు.
ప్రస్తుత టోర్నమెంట్లో తాను ఎదుర్కొన్న బంతులతో పోలిస్తే అత్యధికంగా పరుగులు సాధించడం అభినందనీయమని పేర్కొన్నాడు. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న కుమార సంగక్కర వరల్డ్ కప్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడని చెప్పాడు.
వరల్డ్ కప్లో భాగంగా ఆస్టేలియా, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో కుమార సంగక్కర సెంచరీని సాధించినా శ్రీలంక పరాజయం పాలైంది. ఈ సెంచరీతో వరల్డ్ కప్లో హ్యాట్రిక్ సెంచరీని సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
వన్డేల్లో ఇది 24వ సెంచరీ కాగా, ఈ ప్రపంచకప్లో వరుసగా మూడవ సెంచరీ. అంతక ముందు మెల్ బోర్న్లో బంగ్లాదేశ్పై జరిగిన మ్యాచ్లో (105*) పరుగులు చేయగా, వెల్లింగ్టన్లో ఇంగ్లాండ్పై జరిగిన మ్యాచ్లో (117*) పరుగులతో వరుస సెంచరీలను సాధించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో శ్రీలంక విజయం సాధించింది.
ఇప్పటి వరకు వరల్డ్ కప్లో భారత్కు చెందిన సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 6 సెంచరీలు సాధించగా, రికీ పాంటింగ్ 5, సెంచరీలతో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక వన్డే ఫార్మెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుమార సంగక్కర రెండో స్ధానంలో ఉన్నాడు.