పెర్త్: ఐసీసీ వరల్డ్ కప్లో పూల్ బీలో భాగంగా పెర్త్లో భారత్-వెస్టిండిస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 18 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరుకున్నాడు.
183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 పరుగుల వద్ద రోహిత్ శర్మ (7)ను టేలర్ అవుట్ చేశాడు. ఏ మాత్రం షాట్ కొట్టడానికి అనువుగా లేని బంతిని రోహిత్ శర్మ షాట్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు.
ఇటీవల కాలంలో రోహిత్ శర్మ వరుస వైఫల్యాలను చవిచూస్తున్నాడు. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్లో కూడా ఆఫ్ స్టంప్ మీద పడి స్వింగ్ అవుతున్న బంతిని వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గతంలో జరిగిన చాలా మ్యాచ్ల్లో ఇలాంటి బంతులకే రోహిత్ శర్మ ఔటవ్వడం విశేషం.
ఇప్పటికైనా తన బలహీనతను గమనించి బ్యాటింగ్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. లేకపోతే ఇలాంటి వాటిని మళ్లీ మళ్లీ చవిచూడాల్సి వస్తుంది. బంతి పడకముందే షాట్కి సిద్ధం కావడం ఎంత ప్రమాదమో ఈరోజు ఆడిన బంతిని చూస్తే రోహిత్ శర్మకు తెలిసివచ్చినట్లుంది.
ఐసీసీ వరల్డ్ కప్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్ల్లో విఫలమవ్వగా, ఒక్క యూఏఈపై జరిగిన మ్యాచ్లో కాస్త ఫరవాలేదనిపించకున్నాడు. పాకిస్ధాన్తో అడిలైడ్లో జరిగిన మ్యాచ్లో 15 పరుగులకే పెవిలియన్కు చేరుకున్నాడు.
ఇక మెల్బోర్న్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగాడు. యూఏఈతో పెర్త్లో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ (57) చేసి టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 130 వన్డేలాడిన రోహిత్ శర్మ ఈరోజుకీ అనుభవం లేని ఆటగాడు చేసే తప్పిదాలు లాంటివి చేసి వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
వన్డేల్లో అత్యధిక పరుగులు (264) చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. వన్డేల్లో 6 సెంచరీలు, టెస్టుల్లో 2 సెంచరీలు నమోదు చేశాడు.