పెర్త్: ఎబి డివిల్లీర్స్, క్రిస్ గేల్ వంటి బ్యాట్స్మెన్ దంచికొడుతుంటే బౌలర్లు లేదా కెప్టెన్ ఏమీ చేయలేరని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. శుక్రవారం వెస్టిండీస్తో జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దక్షిణాప్రికా కెప్టెన్ డివిల్లీర్స్, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ను కట్టడి చేయడానికి ధోనీ పథక రచన చేయడం తప్పనిసరి అవుతుంది.
అయితే, డివిల్లీర్స్ను భారత్ రన్నవుట్ చేయడంలో విజయం సాధించింది. కాగా, శుక్రవారంనాటి మ్యాచులో గేల్ను ఎలా కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మీకేమైనా ప్రణాళిక ఉందా అని అడిగితే, గేల్, ఎబి డివిల్లీర్స్ లేదా బ్రెండన్ మెక్కుల్లం వంటివారు పరుగుల మోత మోగిస్తుంటే ఏ ప్రణాళిక లేకపోవడమే ఉత్తమ ప్రణాళిక అని అన్నాడు.
ఏ మాత్రం తొణకకుండా చెప్పాలంటే ఓ వ్యక్తి సిక్స్లు కొడుతుంటే చేయడానికి నీకు ఏమీ ఉండదని, ఫ్లీల్డింగ్ ఏర్పాటు చేయడం కూడా కష్టమని ధోనీ అన్నాడు. షార్ట్ పిచ్ డెలివరీలు వేస్తే సమరంలో ఓడిపోతావని, వాటిని కూడా బాదేస్తారని అన్నాడు. చేయడానికి పెద్దగా ఏమీ ఉండదని కూడా అన్నాడు. విభిన్నమైన బంతులను వేస్తూ బ్యాట్స్మన్ను తిప్పలు పెట్టడం తప్ప మరో మార్గం ఉండదని అన్నాడు.
బ్యాట్స్మన్ను విభిన్నమైన బంతుల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు బౌలర్లు మరిన్ని చేయడానికి స్వేచ్ఛ తీసుకుంటారని, అటువంటి సందర్భాల్లో కూడా ఎబి, గేల్ వంటివారు పరుగులు చేస్తుంటే కచ్చితమైన ప్రణాళిక ఏదీ ఉండదని అన్నాడు.
ఎబి డివిల్లీర్స్ లేదా గేల్ పరుగుల వరద పారిస్తున్నప్పుడు నీకు సగం అవకాశాలు మాత్రమే ఉంటాయని అన్నాడు. బౌలర్లు అదనపు చొరవ ప్రదర్శించాలని, వారికి ఫీల్డర్ల సహకారం పూర్తి స్థాయిలో ఉండాలని అభిప్రాయపడ్డాడు.