బాబుకు రివర్స్: నాడు వైస్రాయ్ హోటల్.. నేడు ఎర్రబెల్లి ఝలక్?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చీలిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది సైకిల్ గుర్తు పైన గెలిస్తే... అందులో 10 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. 2/3 వంతు ఎమ్మెల్యేలు తమకు ఉన్నందున తమనే అసలు టిడిపిగా గుర్తించాలని, తామంతా తెరాసలో విలీనమవుతున్నట్లు ఎర్రబెల్లి లేఖ రాశారు.
ఎర్రబెల్లి దయాకర రావు లేఖ రాయడంపై తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి తదితరులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రెండు దశాబ్దాల క్రితం వైస్రాయ్ హోటల్లో జరిగిన సంఘటనను గుర్తుకు చేస్తున్నారు. నాడు జరిగిందే నేడు జరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రెండు దశాబ్దాల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. చంద్రబాబు టిడిపిని చీల్చి, ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్, వైసిపి, ఇతర విపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇప్పుడు ఎర్రబెల్లి అదే చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది తెలంగాణలో గెలిచారు. ఈ ఇరవై నెలల కాలంలో పదిమంది ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. మరో అయిదుగురు మిగిలి ఉన్నారు. వారిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తనకు టిడిపితో సంబంధం లేదని చెప్పారు.