అక్కకు తోడుగా వచ్చిన పదేళ్ల బాలికపై.. వారం రోజులుగా..
పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళుతున్న అక్కకు తోడుగా పరీక్ష కేంద్రానికి వచ్చిన ఓ బాలికపై ఇద్దరు యువకులు వారం రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారు.
హైదరాబాద్: పరీక్షలు రాసేందుకు వెళుతున్న అక్కకు తోడుగా వచ్చిన ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఉదంతమిది. చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఆ బాలికపై వారం రోజులపాటు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
చివరికి నొప్పి తట్టుకోలేక ఆ బాలిక విషయం బయటపెట్టడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 సయ్యద్ నగర్ లో నివసించే బాలిక(10) ఎన్బీటీ నగర్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది.
ఈ బాలిక అక్క ఎన్బీటీ నగర్ లోనే ఓ పరీక్ష కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తోంది. రోజూ అక్కకు తోడుగా పరీక్ష కేంద్రానికి ఈ బాలిక వస్తూ అక్క పరీక్ష అయ్యేంత వరకు అక్కడే కూర్చుని ఎదురుచూసేది.
ఇదే అదనుగా ఇద్దరు యువకులు ఈ బాలికపై కన్నేసి.. వారం క్రితం మాయమాటలు చెప్పి వ్యానులో ఎక్కించుకుని సయ్యద్ నగర్ లోని ఓ షట్టర్ లోకి తీసుకెళ్లి మత్తుమందు చల్లి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించడంతో సదరు బాలిక భయపడి ఈ విషయం దాచి పెట్టింది. మరుసటి రోజు కూడా అదే రీతిలో వ్యానులో ఎక్కించుకుని ఎన్బీటీ నగర్లోనే ఓ గదిలోకి తీసుకెళ్లారు. ఇలా ప్రతిరోజూ ఆ బాలికను భయపెట్టి తీసుకెళ్లి అత్యాచారం సాగిస్తున్నారు.
శుక్రవారం ఉదయం విపరీతమైన నొప్పితో ఆ బాలిక బాధపడుతుండడం తల్లి గమనించి ఆరా తీసింది. బాలిక జరిగిన విషయం మొత్తం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజూ తనలాగే మరో బాలికను కూడా వారు తీసుకొచ్చేవారని బాధిత బాలిక పేర్కొంది.
ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆ యువకుల వయసు 22 సంవత్సరాలు ఉంటుందని, చూస్తే గుర్తుపడతానని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.