12మంది రైతుల ఆత్మహత్య: నాది ఆరంభమేనని నాగం హెచ్చరిక, శ్రవణ్ ఫైర్
హైదరాబాద్: రైతు సమస్యల పైన ఇందిరా పార్క్ వద్ద తన దీక్ష ఆరంభం మాత్రమేనని బిజెపి నాయకుడు, బచావో తెలంగాణ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం నాడు అన్నారు. ఆయన 'కిసాన్ బచావో' పేరిట ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించాలని ఆయన కోరుతూ ఈ ఆందోళన చేపట్టారు. రైతు ఆత్మహత్యలను నివారించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, కరవు మండలాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రైతులకు పంటల బీమా, పెట్టుబడి రాయితీ, ప్రతి రైతుకు నెలకు రూ.3వేలు కరవు భత్యం, గిట్టుబాటు ధర అందించాలన్నారు. రైతు సమస్యల పైన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శాసన సభ సమావేశాల్లో రైతులకు భరోసా ఇవ్వలేకపోతున్నారన్నారు. బంగారు తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యలా అని నిలదీశారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వం: శ్రవణ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం విత్తనాల ధరను 44 శాతం పెంచిందన్నారు. అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై సమాధానం చెప్పలేదని, టిఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. నిజామాబాద్ కలెక్టర్ పైన టిఆర్ఎస్ నేతల దాడిని ఖండిస్తున్నామన్నారు.
రైతుల గురించి నాయకులు మాట్లాడటం లేదు: వీహెచ్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా అనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాలకే పేరు మార్చి స్వచ్ఛ భారత్ అని పెట్టారని విమర్శించారు. రైతుల గురించి ఒక్క నాయకుడు మాట్లాడటం లేదన్నారు.
తెలంగాణలో ఆగని రైతు ఆత్మహత్యలు
తెలగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆదివారం నాడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మడికట్టులో యువరైతు జల్వంత్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా వర్గల్ మండలం పాములపర్తిలో మహిళా కౌలురైతు దుర్మమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
శనివారం 10 మంది రైతుల ఆత్మహత్య, ఇద్దరి గుండెపోటుతో మృతి
పంటల దిగుబడి ఆశించినమేర లేక, సాగుకు చేసిన అప్పులు తీరే దారిలేక తెలంగాణలో శనివారం 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు. నల్గొండ, మెదక్, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మృతి చెందారు.