స్మార్ట్ సిటీలుగా మరో 13 నగరాలు: తెలంగాణ నుంచి వరంగల్కు చోటు
హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల రెండో జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్కు చోటు లభించింది. 13 నగరాల పేర్లతో కూడిన స్మార్ట్ సిటీల రెండో జాబితాను మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విడుదల చేశారు.
ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్కు చెందిన లక్నో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన వరంగల్ 9వ స్థానంలో నిలిచింది. వీటితో పాటు ధర్మశాల, చండీగడ్, రాయ్ పూర్, న్యూ టౌన్ కోల్కత్తా, భగల్పూర్, పనాజీ, పోర్ట్ బ్లెయిర్, రాంచీ, ఇంఫాల్, అగర్తల, ఫరీదాబాద్లు ఉన్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈ 13 సిటీల్లో 9కి పైగా 25 శాతం స్మార్ట్ సిటీ హోదా అర్హతను సాధించాయని తెలిపారు. స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు. వంద ఆకర్షణీయమైన నగరాల్లో భాగంగా ఇప్పటికే 98 నగరాలను గుర్తించామన్నారు.
స్మార్ట్ సిటీల్లో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిధులను వెచ్చిస్తామన్నారు. రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అనే నినాదం ఉండేదని, ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నినాదం చేపడుతున్నామన్నారు.
ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తొలి జాబితాలో 12 రాష్ట్రాలకు చెందిన నగరాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నగరాలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో విడదల చేసిన స్మార్ట్ జాబితాలో ఒక్క పాయింట్ తేడాతో వరంగల్ అవకాశాన్ని కోల్పోయింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ సిటీ పథకం కింద ఐదేళ్ల గాను రూ. 48వేల కోట్లను ఖర్చు చేయనున్నారు.