పెళ్లి పేరుతో యువతులకు గాలం, డబ్బులు వసూలు: 15మంది నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి, వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న నైజీరియన్ల ఆటలు కట్టించారు నగర పోలీసులు. ఆన్లైన్ అడ్డాగా తెగపడుతున్న నైజీరియన్లు మోసాలకు చెక్ పెట్టారు. మ్యాట్రిమోని సైట్ ద్వారా హైదరాబాద్ యువతులను నైజీరియన్లు మోసం చేసినట్లు పోలీసుల విచారణ తెలిసింది.
తమను ఎన్నారైలుగా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటామని నమ్మించి పలువురు యువతుల నుంచి నైజీరియన్లు డబ్బులు వసూలు చేశారు. తాము మోసపోయామని గ్రహించిన యువతులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు.. నిందితులైన 15మంది నైజీరియన్లను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. వారిలో 9 మందిని హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో 12మందిపై కేసు నమోదు
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో గడిచిన రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ను చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ద్విచక్ర వాహనాలను, కార్లు, ఆటోలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
సహకార బ్యాంకులో భారీగా అవకతవకలు
రంగారెడ్డి జిల్లా దండుమైలారం సహకార బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగాయి. బ్యాంకు చైర్మన్, సీఈవోలు కలిసి రైతుల పేరుతో రూ.30 లక్షల వరకు డ్రా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు బ్యాంక్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. సహకార బ్యాంకులో దాదాపు 1250 మంది రైతులు ఉన్నారు.