నల్గొండ మున్సిపాలిటీలో 3 కోట్ల అవినీతి: ఒకేసారి 21 మంది సస్పెన్షన్
హైదరాబాద్: నల్గొండ మున్సిపాలిటీలో భారీ అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో అవినీతి ఉద్యోగులపై వేటు పడింది. 16 మంది బిల్ కలెక్టర్లతో పాటు, ఐదుగురు రెవెన్యూ అధికారులు (యుడిఆర్ఐ, ఒక ఆర్వో, ముగ్గురు ఆర్ఐ)లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం రేపింది.
2011 నుండి 2015 మార్చి నెలాఖరు వరకు జరిగిన ఆస్తి పన్ను వసూలులో ఏకంగా 3.32 కోట్లు జమ చూపకుండా సిబ్బంది స్వాహా చేసినట్లుగా ఆడిట్ బృందం పేర్కొంది. దీంతో ఇందుకు బాధ్యులైన 21 మంది మున్సిపల్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
వీరిలో ఇద్దరిని గతంలోనే సస్పెండ్ చేయగా రశీద్ పుస్తకాల మాయంలో మరో నలుగురు ఉద్యోగులు పోలీస్ కేసులను ఎదుర్కొంటుండటం విశేషం. ఇది ఇలా ఉంటే నల్గొండ మున్సిపాలిటీ తరహాలోనే తెలంగాణలోని మిగతా మున్సిపాలిటీల్లో కూడా ఇదే రకమైన అవినీతి జరిగి ఉండవచ్చన్న అనుమానాలతో ప్రభుత్వం విచారణ దిశగా ఆలోచిస్తుంది.
గత జూలై 24వ తేదినే ఆడిట్ బృందం నల్గొండ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను స్వాహా లెక్క తేల్చి ఉద్యోగుల సస్పెండ్కు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నల్లగొండ మున్సిపాలిటీలో భారీ అవినీతి కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో మున్సిపల్ దుకాణాల లీజుల అక్రమాలు, లీజుదారులు ఏకంగా 44 దుకాణాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వైనం ఇటీవలే వెలుగు చూసింది.
దీనికి తోడు పన్ను వసూళ్లు, అంతస్తుల నిర్మాణాల అనుమతుల్లో అవకతవకలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, సిసి డ్రైయిన్స్ పనుల్లో అవినీతి, మున్సిపల్ స్థలాలు, పార్కుల ఆక్రమణల వ్యవహారాలతో గత ఏడాది కాలంగా మున్సిపాలిటీలో భారీ అవినీతి అక్రమాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తుండటం స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది.