అతని పురుషాంగాన్ని కోసేయ్: నయీమ్, దేశంలో 29 అడ్డాలు, భార్యే కీలకం
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం అతని నేర సామ్రాజ్యానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా, షాద్నగర్ పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. జిల్లా జైలులో ఉన్న నయీం భార్య హసీనాబేగం, సోదరి సలీమాబేగం, బంధువు మహ్మద్ అబ్దుల్ మతీన్ అలియాస్ ఫిరోజ్, ఆయన భార్య కలీమాబేగంలను విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కోర్టు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియడంతో..పోలీసులు వారిని మహబూబ్నగర్ జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే విచారణలో నయీం సోదరి సలీమాబేగం, ఇతరుల నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. నయీం తమ బంధువులు, తెలిసిన వారి పిల్లలను అత్మరక్షణ కోసం తన వద్ద ఉంచుకునేవాడని, అమ్మాయిలు యుక్త వయసుకు రాగానే లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు వాడుకునేవాడని వారు విచారణలో తెలిపినట్లు సమాచారం.
రక్షణ కోసం నియమించుకున్న వారిలో ఎవరైనా తన సమాచారం బయటికి చెబుతున్నట్లు అనుమానం వస్తే నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవాడని వారు తెలిపినట్టు తెలిసింది. ఇలా నయీం 12 నుంచి 13 హత్యలు చేసినట్లు విచారణ అనంతరం పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.
దేశ వ్యాప్తంగా 29 అడ్డాలు
అలాగే నయీం నేర సామ్రాజ్యం దేశవ్యాప్తంగా విస్తరించిందని, ముంబై, గోవా, రాయ్పూర్, ఒంగోలు, హైదరాబాదుతో కలిపి దేశవ్యాప్తంగా 29 అడ్డాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. మరోవైపు షాద్నగర్లో ఉన్న ఇంటికి 'మామిడి' అని పేరు పెట్టుకున్నట్లు హసీనా పోలీసుల విచారణలో వెల్లడించింది.
సెటిల్మెంట్లకు ముందు భార్య హసీనా, సోదరి పాత్రే కీలకం
ఏదైనా సెటిల్మెంట్ చేయాలంటే ముందుగా వాహనంలో నయీం భార్య హసీనా, సోదరి సలీమా వెళ్లేవారు. అక్కడ పరిస్థితులు సురక్షితమని వీళ్లిచ్చే సమాచారం ఆధారంగా నయీం అక్కడికి చేరుకునేవాడు. షాద్నగర్కు నయీం ఎప్పుడొచ్చినా గేటు దగ్గర పాశం శ్రీను, శ్రీధర్గౌడ్ ఏకే-47లు పట్టుకుని కన్పించేవారు. 'సెటిల్మెంట్లలో వచ్చే డబ్బును హసీనా లెక్క చూసుకునేదని, ఏమాత్రం తేడా వచ్చినా ఒప్పుకునేది కాదని, నయీం చేసిన ప్రతి అక్రమంలో భార్య, అక్కకు భాగస్వామ్యం ఉందని' పోలీసులు గుర్తించారు.
పురుషాంగాన్ని కోసేయాలని ఆదేశం
అలాగే షాద్నగర్లో ఉండే ఖలీమాకు అంతకుముందే నయీంకు సమీప బంధువు ఖయ్యూంతో పెళ్లయిందని, మతీన్తో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేదని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నయీం మతీన్ పురుషాంగాన్ని కోసేయాలని ఖలీమాను ఆదేశించాడని, ఆమె ఆ పని చేయలేదని సమాచారం. అంతలోనే ఖయ్యూం అనారోగ్యంతో చనిపోవడంతో నయీం.. మతీన్ను బెదిరించి ఖలీమాతో పెళ్లి చేసి వారిని షాద్నగర్ అడ్డాలో ఉంచినట్టు తెలిసింది.
ముగిసిన కస్టడీ
గ్యాంగ్స్టర్ నయీం భార్య హసీనా, సోదరి సలీమా బేగం, వాచ్మెన్ అబ్దుల్ మతిన్, ఖలీమాలకు కస్టడీ పొడిగించాలని మంగళవారం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. వీరికి మంగళవారంతో పోలీస్ కస్టడీ ముగిసింది. పోలీసులు ఈ నలుగురినీ షాద్నగర్ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
మరో 10 అరెస్ట్, ఐదుగురు విద్యార్థులే: 39కి చేరిన అరెస్టుల సంఖ్య
నయీం కేసులో అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం పది మంది నయీం అనుచరులను సిట్ అధికారులు అరెస్టు చేసినట్టు, నయీంతో అంటకాగి అనేక నేరాలకు పాల్పడిన మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సిట్ ఐజీ నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరిలో నలుగురు భువనగిరికి చెందినవారు కాగా..ఆరుగురు నల్గొండకు చెందిన వారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య 39కి చేరింది.
అరెస్టయిన వారిలో భువనగిరి సంజీవనగర్కు చెందిన కత్తుల జంగయ్య(37), పులి నాగరాజు అలియాస్ పులిరాజు (23), గాంధీనగర్కు చెందిన గుర్రం శివరాజు అలియాస్ గుర్రం రాజు అలియాస్ చిరంజీవి(26), ఆర్.బి.నగర్కు చెందిన బచ్చు నాగరాజు (37) ఉన్నారు. ఈ నలుగురి సభ్యుల ముఠా.. నయీం ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుతో కలిసి కిడ్నాపులు, బెదిరించి దుకాణాలు, ఇళ్ల స్థలాలు తమ పేరుమీద బదలాయించుకోవడం, ఒక ఎన్నారైతోపాటు స్థానిక వ్యాపారిని బెదిరించి రూ.కోటి వసూలు చేయడం వంటి నేరాలకు పాల్పడ్డారన్నది పోలీసుల అభియోగం.
వీరిలో పులి నాగరాజు ఎంబీఏ విద్యార్థికాగా.. బచ్చు నాగరాజు యువ మొబైల్స్ పేరుతో ఒక దుకాణం నిర్వహిస్తున్నాడు. నయీంకు అవసరమైన సిమ్కార్డులు ఇతనే సరఫరా చేసేవాడన్న ఆరోపణలున్నాయి. అలానే నల్గొండ పట్టణానికి సయ్యద్ అన్సరుల్లాగోరీ అలియాస్ అన్సర్(23), సయ్యద్ అజాజ్ అలియాస్ అజాజ్ బాబా(22), మహ్మద్ జబీయుద్దీన్ సాయద్(21), షేక్ అబ్దుల్లా అలియాస్ చాంద్(23), మహ్మద్ తబ్రేజ్(22), మహ్మద్ ముబిన్ అలియాస్ కాల ముబిన్(23)లను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు.
వీరిలో సయ్యద్ అజాజ్, ముబిన్లు తప్ప మిగతా వారంతా విద్యార్థులే కావడం గమనార్హం. వీరంతా నాలుగు కేసులలో నిందితులు. వీటిలో మూడు కేసులు ఆయుధాలతో బెదిరించి డబ్బు లాక్కోవడానికి సంబంధించినవికాగా.. ఓ కేసు చంపుతానని బెదిరించడం, హత్యాయత్నానికి పాల్పడటానికి సంబంధించినదిగా పేర్కొన్నారు.