క్రికెట్ బంతి తగిలి హైద్రాబాద్లో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల క్రికెట్ ఆట ఆడుతూ పలువురు మృతి చెందడం, గాయాలపాలవుతుండటం తెలిసిందే. తాజాగా వనస్థలిపురంలో మరో సంఘటన జరిగింది.
వనస్థలిపురం సహారా ఎస్టేట్లో గురువారం సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా వంశీకృష్ణ అనే ఆరేళ్ల చిన్నారి గాయపడ్డాడు. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వంశీకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వంశీకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సహారా ఎస్టేట్లో విషాదం అలుముకుంది.
కాగా, క్రికెట్ ఆడుతూ ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అంకిత్ కేసరి అనే యువకుడు మృతి చెందాడు. గత శుక్రవారం ఓ బంతిని క్యాచ్ పట్టబోతూ మరో ఆటగాడిని గుద్దుకున్నాడు. అతనికి తీవ్ర గాయమైంది. అతనిని ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం అతను మృతి చెందాడు.
ఆ తర్వాత రోజునే రాహుల్ ఘోష్ అనే మరో ఆటగాడు గాయపడ్డాడు. వీడియోకాన్ క్రికెట్ అకాడమీ వేదికగా విజయ్ స్పోర్టింగ్, కోల్కతా పోలీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ ఘోష్ (20) గాయపడ్డాడు. అతని పరిస్ధితి క్రమంగా మెరుగవుతోందని, అతడు కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.