మల్టీ మిలియనీర్ల నగరాలు: టాప్ 20లో హైదరాబాద్
హైదరాబాద్: భారతదేశంలో కుబేరుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గడిచిన పదేళ్ల కాలంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ఆర్ధిక రాజధాని ముంబైలలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఓ నివేదికలో పేర్కొంది. టాప్-20 నగరాల్లో హైదరాబాద్తోపాటు వాణిజ్య రాజధాని ముంబై, పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి.
ఆసియా పసిఫిక్ దేశాల్లో మల్టీ మిలియనీర్ల టాప్-20 నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకుంది. గడచిన పదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో కుబేరుల సంఖ్య మూడు రెట్లు పెరిగారు. 2004లో 160 మంది కోటీశ్వరులు ఉండగా 2014 నాటికి ఈ సంఖ్య 510కి చేరుకుందని న్యూ వరల్డ్ వెల్త్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
నగరంలో వ్యక్తిగతంగా 62.5 కోట్ల రూపాయలు, అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులు కలిగివున్నవారిని మల్టీ మిలియనీర్లుగా లెక్కించారు. ఆసియా పసిఫిక్ రీజియన్లో టాప్ 20 నగరాల్లో వియత్నాంలోని హోచిమిన్ నగరం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. వేగంగా కోటీశ్వరులు పెరుగుతున్న భారత నగరాల్లో పూణె ముందు వరుసలో నిలిచింది.
2004 డిసెంబర్లో కేవలం 60 మంది ఉండగా, ఇప్పుడు 250కి చేరుకున్నారు. దీనిని బట్టి గడచిన పదేళ్ల కాలంలో 317 శాతం చొప్పున పెరిగారు. ఆ తర్వాతి స్ధానంలో ముంబై ఉంది. ముంబైలో ప్రస్తుతం 2,690 మంది కుబేరులు ఉన్నారు. 2004లో బెంగుళూరులో 140 మంది ఉండగా, ఆ సంఖ్య గత ఏడాది చివరకు 440కి చేరింది.
ఇక ఢిల్లీలో కూడా 430 నుంచి 1,350కి పెరిగారు. చెన్నైలో 130 మంది నుంచి 390కి, కోల్కతాలో 210 నుంచి 570కి చేరారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ధనికులున్న దేశాల్లో అమెరికా మొదటి స్ధానంలో నిలిచింది. అమెరికాలో ప్రస్తుతం 1,83,500 మంది కోటిశ్వరులు ఉన్నారు.
26,600 మందితో చైనా రెండో స్థానంలో నిలిచింది. 25,400 మందితో జర్మనీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. 14,800 మంది మల్టీ-మిలియనీర్లతో భారత్కు ఎనిమిదో స్థానం లభించింది. గత ఏడాది డిసెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల మంది మిలియనీర్లు ఉన్నారు.