ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి ఇక 9 గంటలు విద్యుత్తు: కెసిఆర్
హైదరాబాద్: వచ్చే ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగలు 9గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖాధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏప్రిల్ నెల నుంచి 9 గంటలపాటు పగటి పూటనే విద్యుత్ను సరఫరా చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదనంగా మరో 4,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్యం పనిచేస్తోందని వివరించారు. ప్రభుత్వ నిర్ణీత లక్ష్యాల మేరకు పనిచేస్తోన్న అధికారులను సీఎం అభినందించారు.
ప్రస్తుతం 4,445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. భూపాల్పల్లిలో ఈనెల 5న 6 వందల మెగావాట్ల విద్యుత్ యూనిట్ను ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ నాటికి జైపూర్ (సింగరేణి) నుంచి మరో 12 వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని తెలిపారు.
ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కూడా ఈ ఏడాది చివరినాటికి అందుతుందని చెప్పారు. ఏప్రిల్ నాటికే 8 వందల మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందనున్నట్టు తెలిపారు. ఈయేడాది చివరి నాటికి మరో 2 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుతుందని తెలిపారు.
మొత్తంగా ఈయేడాది చివరి నాటికి అదనంగా 4,600 మెగావాట్ల విద్యుత్తే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. బీహెచ్ఈఎల్ ద్వారా నిర్మించే పవర్ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. 2018 వరకు 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం అధికారులు పనిచేయాలని కోరారు.
భూమి ఎగ్జిబిషన్ సొసైటీకి ఇస్తాం...
నాంపల్లి ఎగ్జిబిషన్ స్థలాన్ని సొసైటీ పేరున మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. శుక్రవారం నాంపల్లిలో ఎగ్జిబిషన్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ స్థలాన్ని సొసైటీ పేరున మార్చే ప్రక్రియ మొత్తం రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో 30 వేల మందికి విద్యను అందిస్తున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. డొనేషన్లు లేకుండా కార్పోరేట్ కాలేజీలకు దీటుగా ఆ సంస్తలు పేదలకు విద్యను అందిస్తున్నాయని ఆయన చెప్పారు.