అనుమానాస్పద స్థితిలో బీఫార్మసీ విద్యార్థి మృతి
అనుమానాస్పద స్థితిలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలంలో గురువారం వెలుగుచూసింది.
వరంగల్: అనుమానాస్పద స్థితిలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలంలో గురువారం వెలుగుచూసింది. మిల్స్కాలనీ ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. శివనగర్కు చెందిన పత్తిపాక వినయ్(21) నర్సంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నాడు. మార్చి 21న కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఖిలావరంగల్ పడమరకోట మాలారు గుర్తచెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. బావిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి ఎంజీఎం మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వినయ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.
19 కిలోల వెండి వస్తువులు స్వాధీనం
విజయవాడ నుంచి రైల్లో అక్రమంగా 19 కిలోల వెండి వస్తువులు రవాణా చేస్తున్న వ్యక్తిని వరంగల్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జీఆర్పీ స్టేషన్లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జీఆర్పీ సీఐ స్వామి, ఎస్సై శ్రీనివాస్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం... గురువారం వరంగల్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు దిగిన బమర్లాల్ను అనుమానంతో తనిఖీ చేశారు.
అతడి వద్ద భారీగా వెండి వస్తువులు దొరకడంతో వెంటనే అదుపులోకి తీసుకొని విచారించారు. విజయవాడలోని విశాల్ సిల్వర్ దుకాణం నుంచి వరంగల్లోని దుకాణాలలో విక్రయించడానికి వెండి వస్తువులు తెచ్చినట్లు అమర్లాల్ చెప్పాడు.
వస్తువులకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని, స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టు ద్వారా ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తామని తెలిపారు. జీఆర్పీ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు...
తల్లి చనిపోయిన పుట్టెడు దుఃఖంలోనూ బంధువుల సహకారంతో ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసింది. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్పల్లి గ్రామానికి చెందిన తిప్పర్తి రాజేశ్వరి(38) వివాహం ఖమ్మంకు చెందిన రాముతో జరగగా, పెళ్లయినప్పటి నుంచి వారు రాజేశ్వరి తల్లి గారింటి వద్దే జీవిస్తున్నారు.
నాలుగేళ్ల క్రితం రాము మృతి చెందగా, అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు పదో తరగతి చదివే ప్రత్యూష, ఐదో తరగతి చదివే కుమారుడు వంశీ ఉన్నారు. తల్లి చనిపోయిన బాధలో ప్రత్యూష ఉండగా... భవిష్యత్ దృష్ట్యా పరీక్ష రాయాలని బంధువులు సూచించారు. దీంతో ఆమె కన్నీళ్లను దిగమింగుతూ గురువారం రాయపర్తిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో జరిగిన పదో తరగతి గణితం పరీక్షకు హాజరైంది. ప్రత్యూష పరీక్ష రాసి వచ్చాక తల్లి రాజేశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు.
ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
ఖమ్మంలో పదో తరగతి ఆంగ్ల ప్రశ్న పత్రం-1 బహిర్గతమైన వ్యవహారానికి సంబంధించి ఏడుగురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రశ్నపత్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని కేంద్రం నుంచే ఖమ్మం చేరినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన దంతాలపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు సతీష్, వెంకట్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు ఆ రోజు పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్గా విధులు నిర్వర్తించిన వెంకట్రామ్, చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డిపార్ట్మెంట్ అధికారి భిక్షపతి, సెంటర్ కస్టోడియన్ వెంకన్నను సస్పెండ్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి గురువారం వెల్లడించారు.