బోరుబావి: మృత్యుంజయుడు తిరుమలేశ్లానే ఈ చిట్టి తల్లీ రావాలి..
మహబూబ్నగర్: మనదేశంలో ఎలాంటి మూతలు లేకుండా ఉన్న బోరు బావులు అనేక మంది చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. వీరి మరణాలకు బోరు బావుల యాజమాన్యాలతోపాటు చిన్నారుల తల్లిదండ్రుల నిర్లక్ష్యమూ కారణమనే చెప్పాలి. ఏది ఏమైనా అభంశుభం ఎరుగని చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి.
బయటపడాలి..
తాజాగా,రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో చిన్నారి హర్షిత బోరుబావిలో పడి దాదాపు 44 గంటలు గడుస్తోంది. దీంతో పాప పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె ప్రాణాలతో బయటికి రావాలని ఆమె తల్లిదండ్రులతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆ భగవంతుడిని కోరుకుంటున్నారు.
మృత్యుంజయుడు
కాగా, గతంలో ఇలాంటి బోరుబావిలో పడిన ఓ బాలుడు ప్రాణాలతో భయటపడి మృత్యుంజయుడయ్యాడు. ఈ ఘటన నాలుగున్నరేళ్ల క్రితం ఉమ్మడి పాలమూరు జిల్లా అయిజ మండలం బింగిదొడ్డిలో చోటు చేసుకుంది. బింగిదొడ్డి గ్రామానికి చెందిన బాలుడు తిరుమలేశ్ బోరుబావిలో పడి 7గంటల తర్వాత మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు. ప్రస్తుతం తిరుమలేశ్కు ఆరేళ్లు. అయిజలో ఒకటో తరగతి చదువుతున్నాడు.
నాలుగున్నరేళ్ల క్రితం..
ఆ వివరాల్లోకి వెళితే.. 2012 డిసెంబర్ 7న సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో బింగిదొడ్డికి చెందిన వీరన్న, సుజాతల కుమారుడు తిరుమలేశ్ పొలంలో తన సోదరితో ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. అపుడు తిరుమలేశ్ కూడా దాదాపు ఏడాదిన్నర వయసులో ఉన్నాడు. ఆ పక్కనే పొలంలో పనిచేస్తున్న తండ్రి వీరన్న విషయం తెలుసుకొని అధికారులకు చెప్పారు.
ఇప్పుడు కూడా..
బోరుబావిలో పడ్డ బాలుడు 7 గంటల 15 నిమిషాలు అందులోనే గడిపి చివరకు అధికారుల ప్రయత్నాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి పాలమూరు కలెక్టరు పురుషోత్తంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ప్రొక్లెయిన్లు, టాక్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించారు. అధికారులు చాకచక్యంగా వ్యవహరించి బోరుబావికి సమాంతరంగా 40 అడుగులకు పైగా గుంతను తవ్వి బాలుడిని రక్షించారు. ఇప్పుడు హర్షిత కూడా ఇలాగే ప్రాణాలతో బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు.