అందంగా లేనని.. రైలు కిందపడి యువతి ఆత్మహత్య
ఖమ్మం: జిల్లాలోని గార్ల మండలం మద్దివంచలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఓ యువతి తనను ఎవరూ వివాహం చేసుకోరేమోననే బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలో జిల్లాలోని గార్ల మండలం మద్దివంచకు చెందిన శిరీష(18) స్థానిక పదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతోంది.
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైంది. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. రాత్రి అయినా శిరీష ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన సోదరుడు ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ ఎత్తలేదు.
కాగా, 'అన్నయ్యా.. అమ్మను బాగా చూసుకో.. నాన్న జాగ్రత్త.. ఇక నేను ఎప్పటికీ మీకు కనపడను. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుటుంబంలోనే పుట్టాలని ఆ దేవున్ని కోరుకుంటా' అని తన సోదరుడికి మెసేజ్ పంపింది. ఏమి చేసుకోవద్దు, వెంటనే ఇంటికి రావాలని మెసేజ్ పంపినా ఆమె తిరిగి స్పందించలేదు. దీంతో భయాందోళనకు గురైన సోదరుడు, తల్లిదండ్రులు ఆమెకు గాలింపు చేపట్టారు.
దీంతో పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు, వారితో కలిసి గాలించారు. రైలు పట్టాలపై శిరీష మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు పద్మ, వెంకన్న, సోదరుడు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.