బడిలో ప్రసవం: టాయ్లెట్లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలిక, గుర్తించని టీచర్లు
హైదరాబాద్: పాఠశాల సాక్షిగా ఓ బాలిక తల్లి అయింది. 9వ తరగతి విద్యార్థిని తాను చదివే పాఠశాలలోనే ప్రసవించింది. ఆ బాలిక నిత్యం పాఠశాలకు వస్తున్నా.. ఆమె గర్భవతి అన్న విషయం ఉపాధాయులు గుర్తించకపోవడం ఒక గమనార్హం. మండల విద్యాధికారిగా (ఎంఈఓ) బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ విషయం తెలిసీ బడికి వెళ్లకపోవడం శోచనీయం.
హైదరాబాద్లోని మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక చంద్రనాయక్తండాలో నివాసముంటున్న ఓ వ్యక్తికి నలుగురు కుమార్తెలు. ఇద్దరికి పెళ్లిళ్లు కాగా, మిగతా ఇద్దరు మాదాపూర్ పాఠశాలలో చదువుతున్నారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(15) శనివారం మధ్యాహ్నం మూడో అంతస్తులో ఉన్న తరగతి గది నుంచి కిందనున్న మూత్రశాలకు వెళ్లింది. అక్కడే ఓ పాపకు జన్మనిచ్చింది. మరో విద్యార్థిని ఇది గమనించి ఉపాధ్యాయులకు తెలిపింది. వారు వెళ్లి పరిస్థితిని పరిశీలించి.. ప్రసవించిన బాలికతోపాటు పసిపాపను గదిలోకి తీసుకెళ్లి గోనెసంచులపై పడుకోబెట్టి శుభ్రం చేశారు. విషయాన్ని బాలిక తండ్రికి తెలపడంతో వారు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు.
అయితే, 13 మంది టీచర్లు ఉన్నా బాలిక గర్భవతి అనే విషయం గుర్తించలేదా? ఓ బాలిక గర్భవతి కావడంతో పాటు, తొమ్మిది నెలలు నిండే వరకు రోజూ బడికి వస్తున్నా ఉపాధ్యాయులు గుర్తించలేదంటే నమ్మశక్యంగా కనిపించడంలేదు. ఈ స్కూల్లో మొత్తం 20 మంది ఉపాధ్యాయులుంటే అందులో 13 మంది మహిళా ఉపాధ్యాయులున్నారు.
అంతేగాక, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న బసవలింగం ఎంఈఓగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాలిక ప్రసవం విషయం తెలిసినా ఆయన కనీసం పాఠశాలకు వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం గమన్హారం.
కాగా, ఈ విషయంపై బసవలింగంను వివరణ కోరగా.. గర్భం దాల్చిన విషయం ఆమె కుటుంబసభ్యులకు తెలుసని చెప్పారు. ఈ విషయం పాఠశాలలో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఇంటి పక్కన ఉంటున్న ఓ యువకుడు ఆమెకు గర్భం చేసినట్లు వారు తెలిపారని చెప్పారు. అయితే ఆరు నెలలుగా గర్భంతో విద్యార్థిని పాఠశాలకొస్తున్నా ఉపాధ్యాయినులు పట్టించుకోని విషయంలో వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.