46వేలకు కన్న కూతురునే అమ్మేశాడు: కిడ్నాప్ అంటూ నాటకం, ఏం జరిగిందంటే?
హైదరాబాద్: ఓ వ్యక్తి తన కన్నకూతురునే రూ. 46వేలకు విక్రయించాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. కిడ్నాప్డ్రామా ఆడిన సదరు వ్యక్తితో పాటు చిన్నారిని కొనుగోలు చేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన హైదరాబాద్లోని లంగర్ హౌజ్లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ డబీర్పురాకు చెందిన మస్తాన్ ఆటో డ్రైవర్. ఆగస్టు 8న ఠాణాకు వచ్చి, నాలుగు రోజుల క్రితం(ఆగస్టు 4) బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పీవీ ఎక్స్ప్రెస్ 70వ నంబరు స్తంభం వద్ద తన 9 నెలల బిడ్డ నూరీన్ బేగంను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు.
తనను కూడా లింగంపల్లి వరకు తీసుకెళ్లిన దుండగులు, రూ.5వేలు చేతిలో పెట్టి పారిపోయారని తెలిపాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు నిఘా ఉంచారు. శేరిలింగంపల్లి, గుల్మార్ పార్కు సమీపంలోని ఓ ఇంట్లో చిన్నారి ఉన్నట్లు క్రైం ఎస్సై అంజయ్య గుర్తించి చిన్నారిని రక్షించారు.
అసలేం జరిగిందంటే..
ఆగస్టు 4న మస్తాన్ ఆయన భార్య రిజ్వానా చిన్నారితో కలిసి అత్తాపూర్లోని కల్లు కంపౌండ్కు వచ్చారు. ఇద్దరు కలిసి కల్లు తాగారు. రిజ్వానా మత్తులోకి వెళ్లింది. ఇదే అదనుగా మస్తాన్ తన కుమార్తెను బేరానికి పెట్టాడు.
శేరిలింగంపల్లి, గుల్మార్ పార్కు ప్రాంతానికి చెందిన మేస్త్రీ వేమల బాల్రాజ్, బాలమణి దంపతులకు సంతానం లేకపోవడంతో రూ.46వేలకు మస్తాన్ నుంచి చిన్నారి(9 నెలలు)ని కొనుగోలు చేశారు. దీంతో ఆ దంపతులతో పాటు మస్తాన్ను అరెస్టు చేశారు. రూ.14వేలు స్వాధీనం చేసుకుని, చిన్నారి నూరీన్బేగంను తల్లి రిజ్వానాకు అప్పగించారు.