కిషన్ రెడ్డి సభలో కలకలం: వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నల్గొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నల్గొండ జిల్లాలో బుధవారం జరిగిన ‘ప్రజా పునరంకిత' సభలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంచలనం రేపింది. సభలో కిషన్రెడ్డి ప్రసంగిస్తుండగా తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన బరిశెట్టి శంకర్ (25) ఆకస్మాత్తుగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని వేదికపైకి పరుగు తీశాడు.
ఈ హఠాత్పరిణామంతో ఖంగుతిన్న బిజెపి కార్యకర్తలు వెంటనే శంకర్ను పట్టుకుని దుస్తులు తొలగించి మంటలు ఆర్పివేసి అతడిని రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో రాకపోవడం, అవసరమైన మందులు లేకపోవడంతో వెంటనే స్థానికంగా ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రికి శంకర్ను తరలించారు. తన కళ్ల ముందు జరిగిన ఈ సంఘటనతో షాక్కు గురైన కిషన్రెడ్డి వెంటనే తన ప్రసంగాన్ని ఆపివేసి ఆస్పత్రికి చేరున్నారు.
శంకర్తో మాట్లాడి ఆత్మహత్యాయత్నం సంఘటన వెనుక కారణాలు తెలుసుకున్నారు. తన గ్రామంలోని అంజనేయ స్వామి దేవాలయం ఆధీనంలోని భూమి అక్రమంగా అమ్మడాన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో వస్తున్న వేధింపులు భరించలేక శంకర్ ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడన్నారు.
తన సభా వేదికపై ఇలాంటి ఘటన జరుగడం తనకు బాధ కల్గించిందని శంకర్ ఆత్మహత్య యత్నం చేయకుండా సమస్యను తన దృష్టికి తీసుకవస్తే బాగుండేదంటూ విచారం వ్యక్తం చేశారు. శంకర్ కోలుకునేందుకు ప్రభుత్వం వైద్య సదుపాయం కల్పించకపోతే వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
శంకర్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను కిషన్రెడ్డి వివరిస్తూ కేశరాజుపల్లి గ్రామంలోని అంజనేయస్వామి దేవాలయం పరిధిలోని 30గుంటల గ్రామకంఠం భూమిని బలిజ మల్లయ్య, ముత్తినెని మల్లమ్మ తిప్పర్తి సర్వేయర్ సహకారంతో ఆక్రమించి టిఆర్ఎస్ నాయకుల సహకారంతో మరొకరికి విక్రయించారన్నారు.
దేవాలయం ఆధీనంలోని భూమి అమ్మకానికి వ్యతిరేకిస్తు శంకర్ ఆధ్వర్యంలో గ్రామ యువకులు తిప్పర్తి తహశీల్దార్కు వినతిపత్రం అందించగా వారిపై టిఆర్ఎస్ నాయకులు దాడి చేశారన్నారు. టిఆర్ఎస్ నాయకుల ఒత్తిడితో తిప్పర్తి ఎస్సై శంకర్ బృందాన్ని అరెస్టు చేశారన్నారు. భూమి ఆక్రమించి అమ్మిన వారిని కాదని ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం అన్యామంటు పలువురు గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో శంకర్ను వదిలేశారన్నారు.
అయితే రెండు నెలలుగా దేవాలయ భూమి కోసం పోరాడుతున్న శంకర్ను అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు, పోలీసులతో వేధింపులకు దిగుతుండటంతో ఆవేదన చెందిన శంకర్ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆత్మహత్య యత్నం చేశాడన్నారు. ఈ సంఘటనతో సిఎం కెసిఆర్ కళ్లు తెరిచి గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగడాలను గ్రహించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
ఆంజనేయస్వామి దేవాలయ భూమి అక్రమ అమ్మకం వ్యవహారంలో బాధ్యులైన రెవెన్యూ, పోలీస్ అధికారులపై, టిఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీవోను పిలిచించి భూ కబ్జా విషయంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ కుటుంబానికి న్యాయం చేయాలని, అతన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ బంగ్లా ఎదుట కిషన్రెడ్డి ధర్నా చేశారు.