యువతి వ్యక్తిగత ఫొటోలు ఎఫ్బీలో పెట్టి వేధింపులు: సహోద్యోగే నిందితుడు
ఫేస్బుక్ వ్యక్తిగత ఫొటోలను పెడతానంటూ సహోద్యిగిని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఫేస్బుక్ వ్యక్తిగత ఫొటోలను పెడతానంటూ సహోద్యిగిని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేశ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్కు చెందిన ప్రవీణ్.. ఎల్బీనగర్లో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నాడు.
ఆ సమయంలో సహోద్యోగినితో స్నేహం చేశాడు. మధ్యాహ్నం భోజనం తింటున్న సమయంలో తెలియకుండానే ఆమె ఫొటోలు తీశాడు. స్నేహం పేరు చెప్పి సెల్పీలు దిగాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లిచేసుకుందామన్నాడు. దీనికి ఆమె నిరాకరించింది.
అయినా తరచూ ఫోన్ చేసి వేధించాడు. 'నీవు నా ప్రేమను అంగీకరించూ. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెడుతాం. అంగీకరించక పోతే నీ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా'నని ఓ యువతిని భయభ్రాంతులకు గురి చేశాడు. అతడి వేధింపులు తాళలేక షాపింగ్ మాల్లో ఉద్యోగం మానేసింది.
కోపోద్రిక్తుడైన ప్రవీణ్ ఆమె పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను తెరిచాడు. అందులో బాధితురాలి ఫొటోలను అప్లోడ్ చేశాడు. ఆ యువతి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్నేహితులు ద్వారా ఈ విషయం తెలుసుకున్న బాధిత యువతి.. రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రవీణ్ను అరెస్టుచేశారు. అతడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సైబర్ క్రైం విభాగాన్ని సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.