పట్టించుకోరా?..: కేసీఆర్ సభలో సర్పంచ్ భర్త కలకలం, కటౌట్ పైకి ఎక్కి!
సభా ప్రాంగణం పక్కనే ఏర్పాటు చేసిన వంద అడుగుల కేసీఆర్ కటౌట్ పైకి ఎక్కిన అతను.. కేసీఆర్ మాట్లాడుతుండగా ఓ వినతి పత్రాన్ని చూపించాడు.
ఆదిలాబాద్: గురువారం నాటి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం కార్యక్రమంలో కలకలం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ప్రసంగం ముగింపుకు చేరుకోగానే.. ఓ మహిళా సర్పంచ్ భర్త ఆత్మహత్యయత్నం చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.
సభా ప్రాంగణం పక్కనే ఏర్పాటు చేసిన వంద అడుగుల కేసీఆర్ కటౌట్ పైకి ఎక్కిన అతను.. కేసీఆర్ మాట్లాడుతుండగా ఓ వినతి పత్రాన్ని చూపించాడు. వినతి పత్రంలో గ్రామ సమస్యల గురించి పేర్కొనట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం గంగాపూర్ సర్పంచ్ ఆరెంపల్లి శాంత భర్త చంద్రహాస్ గా అతన్ని గుర్తించారు.
చంద్రహాస్ నిరసన తెలుపుతున్న సమయంలోనే.. పోచంపాడ్కు చెందిన విజయలక్ష్మి అనే మరో మహిళ కూడా కటౌట్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గమనార్హం. తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె ఈ చర్యకు పాల్పడింది.
ప్రసంగం ముగియగానే కేసీఆర్ ఇదేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెనుదిరిగారు. ముగ్గురు కానిస్టేబుళ్లు చాలాసేపు ప్రయత్నించగా.. విజయలక్ష్మి కిందకు దిగింది. చంద్రహాస్ మాత్రం తనకు స్పష్టమైన హామి ఇచ్చేంతవరకు అక్కడినుంచి కిందికి దిగేది లేదని తేల్చి చెప్పారు.
సమస్యలపై అధికారులు ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎటూ తోచని స్థితిలోనే చంద్రహాస్ అలా చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామాన్ని రాష్ట్ర పోలీస్ అధికారి ఒకరు దత్తత తీసుకున్నా పనులు మాత్రం చేయడం లేదని అన్నారు. దీంతో సీపీ కార్తికేయ ఆ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామి ఇవ్వడంతో.. చివరకు చంద్రహాస్ కిందకు దిగాడు.