డ్రైవర్ దృష్టి మరల్చి సీఐడీ అధికారి భార్య నగలే కాజేశాడు
వరంగల్: జిల్లా పోలీపసులు, యంత్రాంగం అంతా టీఆర్ఎస్ సభ భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే దొంగలు ఇదే అదనుగా భావించి చేతికి పని చెబుతున్నారు. పట్టపగలే ఓ పోలీసు అధికారి భార్య కొనుగోలు చేసిన బంగారాన్నే ఎత్తుకెళ్లి పోలీసులకే సవాల్ విసిరాడు ఓ దొంగ.
హన్మకొండ పోలీసు స్టేషన్ పరిధి నయీంనగర్లో గుర్తు తెలియని వ్యక్తి కారు డ్రైవర్ను దృష్టి మరల్చి ఖరీదైన బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. హన్మకొండ సీఐ సంపత్రావు, క్రైం ఎస్ఐ తెలిపిన వవరాల ప్రకారం... నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన కొడగాని చంద్రకళ అనే మహిళ ఎల్ఐసీలో పని చేస్తున్నది. బుధవారం బంగారం నగలు కొనుగోలు చేసేందుకు వరంగల్కు కారులో వెళ్లింది.
సుమారు 18 తులాల బంగారు వడ్డాణాన్ని కొనుగోలు చేసి కారులో భద్రపర్చుకుని హన్మకొండకు బయలు దేరింది. కారు డ్రైవర్ కండపర్తి నవీన్ సాయంతో హన్మకొండ నయీంనగర్కు చేరుకున్నారు. ఆమె కుమార్తెకు 28న వివాహం ఉండడంతో కిషన్పురలోని సునిత కంగన్ హాల్లో మేకప్ సామగ్రిని కొనుగోలు చేసేందుకు చంద్రకళ కారులో బంగారు ఆభరణాల బ్యాగు పెట్టి లోపలికి వెళ్లింది.
ఈ క్రమంలో కారు పక్కకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి 'డ్రైవర్ మీ డబ్బులు కింద పడిపోయాయి' అని చెప్పి దృష్టి మరల్చాడు. వెంటనే కారు దిగి కిందపడిన చిల్లర డబ్బులు ఏరుకుంటుండగా కారు ముందు సీట్లో ఉన్న నగల బ్యాగును తీసుకుని చోరుడు పారిపోయాడు. డ్రైవర్తోపాటు నగల యజమాని చంద్రకళ పెద్దగా అరచినా ప్రయోజనం లేకుండాపోయిది.
వెంటనే ఇద్దరు కలిసి హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా దొంగను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోగొట్టుకున్న బంగారం విలువ సుమారు రూ. 5.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా బంగారం పోగొట్టుకున్న చంద్రకళ భర్త వరంగల్ పోలీసు శాఖలోని సీఐడీ వింగ్లో సీఐ స్థాయి అధికారిగా పని చేస్తుండటం గమనార్హం. సదరు ఆగంతకుడు దృష్టిమరల్చే యత్నం చేసినా పట్టించుకోకుండా ఉంటే ఈ చోరీ జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉద్యోగం రాదేమోనని... మనస్థాపంతో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మహబూబాబాద్: ఉద్యోగం రాదేమోనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం... వరంగల్ రంగశాయిపేట ప్రాంతానికి చెందిన బండి దినేష్కుమార్ (23) బీటెక్ పూర్తిచేసి సంవత్సరం దాటింది.
ఈ క్రమంలో పలు కంపెనీల్లో ఉద్యోగం కోసం వేట కొనసాగించాడు. ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో దేవుడి గుళ్లకు వెళ్తూ పూజలు చేసేవాడు. ఈ క్రమంలో తాను శ్రీకాళహస్తిలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన దినేష్కుమార్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ బోగీలో వరంగల్లో ఎక్కాడు. తన తమ్ముడు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్లైన్ సెక్యూరిటీ మెన్గా ఉద్యోగం సంపాదించాడు.
బీటెక్ చేసినా తనకు ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు, స్నేహితులతో చెప్పుకునేవాడు. తనకు ఉద్యోగం వస్తుందో రాదేమోనని.. మనస్థాపంతో దినేష్కుమార్ మహబూబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ కిందపడి మృతి చెందాడు. సెల్ఫోన్, ఆధార్కార్డులను చూసి అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై ఉపేందర్ తెలిపారు.